Monday, May 6, 2024

Purandeswari: నారా కుటుంబానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ సంఘీభావం

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో శుక్రవారం జరిగిన పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీలో తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో బోరున విలపించారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు చంద్రబాబు కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకులు పురంధేశ్వరి స్పందించారు.

‘భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడడం బాధ కలిగించింది. క్యారెక్టర్‌ అసాసినేషన్‌ సహేతుకం కాదు. నేను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగాం. విలువల్లో రాజీపడే ప్రసక్తి లేదు’ అని పురంధేశ్వరి ట్వీట్‌ చేశారు.

ఈ వ్యవహారంలో భువ‌నేశ్వ‌రికి నంద‌మూరి కుటుంబం సంఘీభావం తెలిపింది. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేయడం తగదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని కానీ వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం దారుణమని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కూడా భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏపీలో రాజకీయాలు ఇంత అథమస్థాయికి పడిపోవడం బాధాకరమన్నారు. ఇన్నాళ్లు వ్యక్తిగత దూషణలు జుగుప్స కలిగించాయనుకుంటే, ఈరోజు చంద్రబాబు అర్ధాంగిని అసభ్యంగా దూషించడం ద్వారా వైసీపీ రాష్ట్ర రాజకీయాలను నీచాతినీచ స్థాయికి దిగజార్చిందని విమర్శించారు. ఇది సిగ్గు చేటు అన్న ఆయన దీన్ని తీవ్రంగా ఖండించారు.

 

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement