Saturday, May 4, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల, ప్రభన్యూస్‌ : వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనార్ధం రెండు కాలిబాట మార్గాలు, రోడ్డు మార్గాన భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటుండడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లు అన్ని నిండి క్యూ లైన్‌ వెలుపలకు వ్యాపించింది. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా భక్తులు నిండి పోవడంతో ఏటిసి మీదుగా ఎస్‌ఎన్‌సి , లేపాక్షి సర్కిల్‌, షాపింగ్‌ కాంప్లెక్సు, పాత అన్నదానం మీదుగా ఆస్థానం మండపం గుండా వరాహస్వామి అతిథిగృహంను దాటి శ్రీవారి సేవా సదన్‌ వద్దుకు క్యూ లైన్‌ వ్యాపించింది. స్వామివారి దర్శనం కోసం దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్‌లలో వేచివున్నారు.

దీంతో శ్రీవారి ఉచిత దర్శనానికి 30 గంటలు సమయం పడుతుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల స మయం పడుతోంది. క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు అన్నప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు నీరు, మజ్జిగ పంపిణీ చేస్తుండడంతో భక్తులు ఉపశమనం పొందుతున్నారు. రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈనెల 20 వరకు సిఫార్సు లేఖలపై బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement