Friday, May 3, 2024

Breaking: ఒంటిమిట్ట రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జ‌గ‌న్‌

ఒంటిమిట్ట, (ప్ర‌భ న్యూస్‌) : ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌డ‌ప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం ఇవ్వాల ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున రాత్రి ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న సీఎం జ‌గ‌న్‌కు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్. జవహర్ రెడ్డి, అర్చ‌కులు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. ముఖ్యమంత్రికి తలపాగా కట్టి పళ్లెంలో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. ముఖ్యమంత్రి వీటిని ఊరేగింపుగా తీసుకుని ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు.

అనంతరం సీఎం జ‌గ‌న్‌కు శేష‌వ‌స్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రికి స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు, ఒంటిమిట్ట రాముల‌వారి చిత్ర‌ప‌టం అంద‌జేశారు. కాగా, ముఖ్యమంత్రి వెంట మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, శాసన సభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి, పి. రవీంద్ర నాథ రెడ్డి, జి. శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement