చిత్తూరు జిల్లాలో కొన్నిరోజులుగా భారీ ఎత్తున బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై దొంగలపై నిఘా వేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదు కాబడిన ద్విచక్రవాహనాల దొంగతనాలను చేధించుటకు ఎస్పీ సెంథిల్ కుమార్.. జిల్లాలోని 4 సబ్ డివిజన్ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న 11 మంది అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.కోటి విలువ గల 107 ద్విచక్ర వాహనాలను చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా చెడు వ్యసనాలకు బానిసలై ద్విచక్ర వాహనాలు దొంగతనానికి పాల్పడుతున్న 11 మంది నిందితుల్లో ఆరుగురు యువకులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.