Saturday, May 18, 2024

Chandrababu – హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

విజయవాడ, : స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు జైలు రిమాండ్‌ను పిటిషన్‌పై తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం సుదీర్ఘంగా వాదనలు సాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ఇంట్లో కన్నా జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని కోర్టుకు వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని అదనపు ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. జైల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని అన్నారు.

రాజమహేంద్ర కేంద్రకారాగారంలో 50 అడుగుల ఎత్తైన గోడలు ఉన్నాయని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉండటం వల్ల చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు అనుమతించవద్దని న్యాయస్థానాన్ని కోరారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. ఆయనకు జైలులో ప్రమాదం పొంచి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కరుడుగట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులు అదే జైల్లో ఉన్నారని, చంద్రబాబుకు ముప్పు ఉన్న నేపథ్యంలోనే ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించారని లూథ్రా కోర్టుకు తెలిపారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీకి సంబంధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని కోర్టుకు విన్నవించారు. హౌస్‌ రిమాండ్‌కి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లూథ్రా వివరించారు. ఇందుకు గౌతం నవలాఖ కేసును ఉదహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement