Monday, April 29, 2024

విశాఖ ఉక్కు ఉద్య‌మానికి పిలుపు… సిపిఐ నేత‌ల‌ అరెస్టు

అనంతపురం, మే 3 : విశాఖ ఉక్కు ఉద్యమానికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో భాగంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ను ముందస్తుగా అరెస్ట్ చేశారు. వన్ టౌన్ పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. బలిదానాలతో స్థాపించినటువంటి ఉక్కు కర్మాగారాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంటున్నది. దీనికి వ్యతిరేకంగా బుధవారం వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు రాస్తారోకో కార్యక్రమానికి వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేసేటువంటి హక్కును హరించి వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులను, ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా గృహనిర్బంధాలు చేయడం, అరెస్టులు చేయడం సిపిఐ జిల్లా సమితి తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాల కాలంలో వేగవంతంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణకు పూనుకుంటున్నదన్నారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 32మంది బలిదానాలతో స్థాపించినటువంటి సంస్థ రైతులు భూములిచ్చారన్నారు. లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సంస్థ రెండు సంవత్సరాలుగా వాళ్ళు నిరసనలు ఉద్యమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందన్నారు.

ఈ అంశంపైన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 151 మంది ఎమ్మెల్యేలు 31 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ, ఇంత పెద్ద మాండేట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లుతూ ఉన్నాడు. అంతే కాకుండా అమెరికా ఇండియన్ బర్గ్ పరిశోధన సంస్థ నివేదిక సమర్పించిన తర్వాత ప్రపంచంలో రెండవ కుబేరుడుగా అవతరించిన గౌతమ్ అదానీ నరేంద్ర మోడీ సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నాడన్నారు. ఇలాంటి సందర్భంలో పార్లమెంటులో, రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ ఒక్కమాట కూడా ఆదానీ గురించి మాట్లాడటం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదానికి విశాఖలో అనంతపురం జిల్లాలో భూములు కట్టబెడుతూ ఉన్నారన్నారు. అదేవిధంగా మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం 30వేల కోట్లకే తెగ నమ్ముతా ఉంటే అదానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉంటే చేతకాని దద్దమ్మ లాగా ఉంటున్నాడన్నారు. అందుకే ఇవాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో కార్యాచరణ రూపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వ విధానాలను ఎండగడతాం, మీ అరెస్టులకు, మీ లాఠీలకు భయపడేటువంటి వారం కాదన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సి జాఫర్ తెలిపారు. తనతోపాటు అనంతపురం సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, భాగ్యనగర్ నారాయణస్వామి, చాంద్ బాషా, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుల్లాయి స్వామి, సిఐటియు నాగరాజు, తదితరులను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement