Wednesday, May 1, 2024

AP: బుద్దా వెంకన్న బల ప్రదర్శన.. అనుచరులతో భారీ ర్యాలీ

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి నమ్మిన బంటును అని ఎప్పుడూ చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తనకున్న అర్థ, అంగ బలాన్ని వివరించే క్రమంలో ప్రదర్శించారు. తనకు విజయవాడ పశ్చిమ లేదా అనకాపల్లి పార్లమెంటు సీటు కేటాయించాలని కోరుతూ విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో గురువారం భారీ ర్యాలీ తన ఇంటి నుండి కనకదుర్గమ్మ గుడి వరకు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం చంద్రబాబు నాయుడికి దరఖాస్తు చేసుకుంటూ, ముందుగా ఆ దరఖాస్తును కనకదుర్గ అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ర్యాలీ సందర్భంగా బుద్ధ వెంకన్న కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తానని హెచ్చరించారు. చంద్రబాబు తనకు దైవ సమానులు అంటూ కీర్తించారు. చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చానన్నారు. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని దరఖాస్తు ఇస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానన్నారు.

సీటు రాలేదని మాపార్టీ వాళ్ళెవరైనా సరే చంద్రబాబును విమర్శిస్తే తాట తీస్తాను అనీ హెచ్చరించారు. నాకు టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబు – పవన్ కళ్యాణ్ ఇద్దరినీ కోరుతున్నట్లు చెప్పారు. గడిచిన ఐదు సంవత్సరాల నుండి ప్రాణాలకు తెగించి టీడీపీ కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో నిలబడటానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. కేశినేని నాని అనే కుక్కకు బుద్ధి చెప్పాలని ర్యాలీగా వచ్చానన్నారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నాడన్నారు. నేను అప్లికేషన్ పెట్టడానికి వస్తేనే భారీగా కేడర్ వచ్చారు, ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోవాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement