Saturday, May 4, 2024

Tirupati: తిరుపతిలో అక్కాతమ్ముడి దారుణహత్య..

తిరుపతి ప్రతినిధి: వివాహేతర సంబంధం కారణంతో తిరుపతి కపిలతీర్థం సమీపంలోని ఓ హోటల్లో జంటహత్యల కలకలం రేపింది. మృతులు మహారాష్ట్ర నాంధేడుకు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు, ఆ దిశగా విచారిస్తున్నారు. నాందేడుకు చెందిన యువరాజ్ కు మనిషా అనే యువతితో పన్నెండు సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు షక్షమ్(6), ప్రజ్ఞాన్ (4). తన భార్య మనిషాతో సొంత అన్న గత కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుపుతున్నట్టు యువరాజ్ గుర్తించాడు. మంచిగా చెప్పినప్పటికీ వారి తీరు మారకపోవడంతో వారిద్దరిని హత్య చేసేందుకు యువరాజ్ ప్లాన్ వేశాడు. తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్దామని తన అన్నతో పాటు భార్య పిల్లలు, బావమరిది హర్షవర్ధన్ ను ఆహ్వానించాడు.

తిరుమల కోసం వచ్చిన యువరాజ్ కపిలతీర్థం సమీపంలోని హోటల్ ఓరియన్ లో దిగారు. అయితే తన అన్న రాకపోవడంతో భార్య పిల్లలు బావమరిదితో కలసి హోటల్ గదిలోకి వెళ్ళాడు. అర్దరాత్రి ఏమైందో ఏమో తెలియదు కానీ, తన భార్య మనిషా ను, బావమరిది హర్ష వర్ధన్ లను శుక్రవారం వేకువజామున నిర్దాక్షిణ్యంగా యువరాజ్ హత్య చేశాడు. ప్రస్తుతం హత్య చేసిన యువరాజ్ ను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా విచారణలో మరిన్ని వాస్తవాలు తెలిసే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా హత్య జరిగిన సమయంలో పిల్లలు నిద్రిస్తుండటంతో వారు బ్రతికిపోయారు. ప్రస్తుతం పిల్లలు పోలీసుల సంరక్షణలో ఉన్నారు. హత్యా సమాచారాన్ని నాందేడ్ లోని మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందించడంతో వారు తిరుపతికి బయలుదేరి వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement