Wednesday, May 8, 2024

ఏపీలో పోలీస్ వ్యవస్థ ప్రక్షాళ: బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన ప్రకటన

ఏపీలోని పోలీస్ వ్యవస్థపై  బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తోందని తెలిపారు. ఏపీ పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపుతో చూస్తోందన్న సీఎం రమేష్.. త్వరలోనే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని చెప్పారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు.

పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదని, అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని సీఎం రమేష్ చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశామని తెలిపారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. అవినీతి కార్యక్రమాలపై ఈ నెల 28న బీజేపీ సభ నిర్వహిస్తోందని ప్రకటించారు. తొలిసారి సీఎం అయ్యారు కాబట్టి.. నెమ్మదిగా అర్ధం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి చూసిందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని అవలంభిస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

దశలవారీ మద్య నిషేధం కాదని.. దశలవారీ మద్యపాన వినియోగాన్ని జగన్ ప్రభుత్వం  ప్రొత్సహిస్తోందని మండిపడ్డారు. ఏపీలో జరిగే ప్రతి కార్యక్రమం కేంద్ర నిధులతోనే చేస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయాల నిర్మాణం కూడా కేంద్ర నిధులతోనే చేపట్టారని పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగిన తర్వాత ఒక్క అడుగు ముందుకు పడలేదని విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement