Monday, April 29, 2024

TTD: టీటీడీలో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కీలక ప్రకటన..

తిరుమ‌ల‌: టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో భర్తీ చేయనున్న టీటీడీలో భర్తీ చేయబోతున్న ఇంజినీరింగ్ పోస్టుల నియామ‌క ప్ర‌క్రియపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇందులో ఎలాంటి సిఫారసులకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో 60 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణ‌యం తీసుకుందన్నారు. ఇందులో చైర్మన్ కు, బోర్డు సభ్యులకు, అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులను కోరారు.

చెన్నై ఐఐటి ఆధ్వర్యంలో పూర్తి పార‌ద‌ర్శ‌కంగా మెరిట్ ప్రాతిప‌దిక‌న ఈ నియామ‌కాలు జరుగుతాయని వివరించారు. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్న ఉద్యోగాల నియామక ప్రక్రియ కూడా ఇదే తరహాలో పూర్తి పారదర్శకంగా మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తామని తెలిపారు. ఇవాళ‌ ఉదయం నుండి నిరంతరాయంగా శ్రీవారి పాదాల వద్ద ప్రతి రోజు హోమం నిర్వహిస్తారన్నారు. పెళ్లిరోజు, పుట్టిన రోజు, ఇతర విశేష రోజుల సందర్బంగా భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి హోమం చేసుకోవచ్చని తెలిపారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఇద్దరు ఈ హోమంలో పాల్గొనవచ్చని చెప్పారు. ప్రస్తుతానికి ఆఫ్ లైన్ లో 50, ఆన్ లైన్ లో 50 టికెట్లు ఇస్తున్నామని , శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక స్లాట్ ల విధానంలో టికెట్ల సంఖ్య పెంచుతామని చెప్పారు . శ్రీ వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు అందిస్తున్న ఆశీస్సులుగా ఈ హోమాన్ని చూడాలన్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement