Saturday, April 27, 2024

AP: సిఎం జ‌గ‌న్ ఇల్లు ముట్ట‌డి .. జెడి ల‌క్ష్మినారాయ‌ణ అరెస్ట్..

తాడేప‌ల్లి – జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఎందుకు చేయరంటూ ఆయ‌న ఇవాళ సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో తాడేపల్లిలో సీఎం ఇంటి ముట్టడికి బయల్దేరిన లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు, తదితరులను పోలీసులు మ‌ధ్య‌లోనే అడ్డుకున్నారు.. ఈ సందర్భంగా పోలీసులకు, లక్ష్మీనారాయణకు మధ్య వాగ్వాదం నెలకొంది. అనంత‌రం పోలీసులు ఆయనను వాహనంలోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు.

అంతకుముందు, లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతోందని, ఇప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తీసుకురావడానికి బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రెండు కూడా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇవాళ తాము ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి రాలేదని, ప్రత్యేక హోదా సాధన కోసం అందరం కలిసి పోరాడుదాం రండి అని చెప్పడానికే వచ్చామని స్పష్టం చేశారు. ఏ విధంగా రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారో, అన్ని పార్టీలను కలుపుకుని మనం కూడా వెళదాం అని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన ద్వారా రాష్ట్రంలోని యువతకు, భావితరాలకు మనమందరం మార్గదర్శకులుగా ఉందాం అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement