Sunday, April 28, 2024

ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఎపి అంత‌టా ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీస్ లు నిలిపివేత‌

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో డిపోలు, బస్టాండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆర్టీసీ బస్సులు తిరగకుండా నిలిపివేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తిరిగే అన్ని బస్సులూ నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో తిరిగే సిటీ బస్సులు కదల్లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నట్టుండి బస్సులను ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పోలీసుల ఆదేశాలు, సూచనల మేరకే బస్సులు రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

విశాఖ ద్వారకానగర్‌ బస్ స్టేషన్‌లో ప్రయాణికులను కిందకు దించేసి బస్సులను డిపోలకు తరలించారు. టికెట్లు తీసుకున్నా ప్రయాణికులకు డబ్బులు వాపస్ ఇచ్చారు. రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులను వేచి ఉండాలని సూచిస్తున్నారు. దీంతో ఉదయాన్నే దూర ప్రాంతాలకు వెళ్లడానికి వచ్చిన వారంతా వెనుతిరిగారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డిపోల నుంచి ఒక్క బస్సు కదలలేదు. విశాఖలో సిటీ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కడప ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఒక్క బస్సును కూడా పోలీసులు బయటికి పంపలేదు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు కదల్లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement