Thursday, May 2, 2024

AP – బీసీ డిక్లరేషన్ లోని 10 అంశాలతో వారి జీవితాలలో కొత్త వెలుగులు – చంద్ర బాబు

మంగళగిరి – టీడీపీ-జనసేన తరఫున ఉమ్మడిగా రూపొందించిన బీసీ డిక్లరేషన్ ను చంద్రబాబు ఇవాళ పవన్ కళ్యాణ్ తో కలిసి మంగళగిరి జయహో బీసీ సభలో విడుదల చేశారు. ఇందులో ఇరు పార్టీలు అధికారంలోకి వస్తే బీసీలకు అమలు చేసే హామీల్ని పొందుపరిచారు.

ఇందులో బీసీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ అమలు, దాడుల నుంచి రక్షణ కల్పించేలా చట్టం వంటి పలు హామీలు ఉన్నాయి. బీసీ డిక్లరేషన్ ను ఇంటింటికీ తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు.

జయహో బీసీ బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. వందల సమావేశాలు పెట్టి, నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్ ప్రకటించామని తెలిపారు. బీసీ డిక్లరేషన్ గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ టీడీపీ అన్నారు. బీసీల డీఎన్‌ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తెచ్చామన్నారు.

బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. బీసీలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తామన్నారు. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని చంద్రబాబు విమర్శించారు. జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారని, రేజర్వేషన్ తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని వెల్లడించారు.

ఎవరికైనా పదవులు దక్కకుంటే నామినేటెడ్ పదవులు ఇస్తామని బీసీలకు చంద్రబాబు మరో హామీ ఇచ్చారు. చట్టబద్ధంగా బీసీల కులగణన చేపట్టాలన్నారు. బీసీల ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని తెలిపారు. బీసీల జోలికి ఎవరైనా వస్తే జాగ్రత్త అని హెచ్చరించారు. పరిశ్రమలు పెట్టేలా బీసీ వర్గాలను ప్రోత్సహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

బీసీలకు షరతులు లేకుండా విదేశీవిద్య పథకం అమలు చేస్తామని, పెళ్లికానుకను తిరిగి ప్రవేశపెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతిఏడాది కుల ధ్రవీకరణ తీసుకునే వ్యవస్థ రద్దు చేస్తామన్నారు. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామన్నారు. చంద్రన్న బీమా కింద బీసీలకు రూ.10 లక్షలు ఇస్తామని, లంచాలు లేకుండా బీసీలకు ధ్రువపత్రాలు ఇచ్చేలా చూస్తామని తెలిపారు. తాము వచ్చిన ఏడాదిలోగా బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేస్తామన్నారు. చెరువులు, దోబీఘాట్‌లపై మళ్లీ హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యాదవుల జీవితాల్లో వెలుగులు తెస్తామని హామీ ఇచ్చారు. బీసీల్లో ఉన్న 157 కులాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ వచ్చాకే బీసీల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement