Thursday, April 25, 2024

AP: స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సిస్టం మారుతోంది.. ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నవంబర్‌ ఒకటి నుంచి ఎన్‌ఈపీని అమలు లోకి తీసుకొచ్చి, ప్రాథమిక పాఠశాలల్లో తరగతుల తరలింపు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. విద్యాశాఖ సర్క్యులర్‌ 172 విడుదల చేయడం ద్వారా తరగతులను విభజించేందుకు అవసరమైన మార్గదర్శకాలను సూచించింది.

ప్రాథమిక పాఠశా లల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను 250 మీటర్ల సమీపంలో ఉన్న ఉన్నత పాఠ శాలలకు తరలించాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల గుర్తింపు, విద్యార్థుల తరలింపు, అర్హులైన ఉపాధ్యాయుల సర్దుబాటు- ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేసేందుకు డీఈవోలు కసరత్తు చేసున్నారు. మరోవైపు ఫౌండేషన్‌ స్కూల్‌లో భాగమైన 1, 2 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లోనే ఉంచాలని నిర్ణయించింది.

ఈ తరగతుల్లో విద్యార్థులు, ఉపాధ్యా యుల నిష్పత్తిని 1: 20గా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు బలమైన పునాది పడుతుందని భావి స్తోంది. అలాగే విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి తక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేక దృష్టిని ఉపాధ్యాయులు సారించగలుగుతారని ప్రభుత్వం భావిస్తోంది.

ఉన్నత పాఠశాలలకు 3, 4, 5 తరగతులు
ప్రాథమిక విద్యలో భాగంగా ఉన్న 3, 4, 5 తరగతులను ఇకనుంచి ఉన్నత పాఠశాలలకు తరలించనున్నారు. ప్రాథమిక పాఠశాలలకు సమీపంలో 250 మీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో ఈ తరగతులను కొనసాగించనున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలల టీ-చర్లు, ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీ-చర్లు బోధించనున్నారు. ఒకవేళ హైస్కూళ్లకు సరిపడిన సంఖ్యలో బోధనా సిబ్బంది లేకుంటే డీఈవోల వద్ద మిగులు టీ-చర్లను కేటాయించాలని నిర్ణయించారు. ఒకవేళ విద్యార్థులకు సరిపడినన్ని గదులు లేకపోతే ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాలల్లోనే 3, 4, 5 తరగతులు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే 3, 4, 5 తరగతులకు బోధించే టీచర్లు, ఉన్నత తరగతులకు బోధించే టీచర్ల మధ్య సమన్వయం రావాల్సిన అవసరం ఉందని, క్వాలిఫికేషన్‌, సీనియారిటీ, క్యాడర్‌ విషయంలో స్పష్టతనివ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

సబ్జెక్టులవారీ బోధన దిశగా..
రాష్ట్ర ప్రభుత్వం 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు సబ్జెక్టులవారీగా బోధన జరిపించాలనే ఉద్దేశంతో అందుకు తగిన ఏర్పాట్లు- చేస్తోంది. అందుకోసం టీ-చర్ల సర్దుబాటు-తో పాటు- ఇతర సదుపాయాల కల్పనకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే పలు దఫాల్లో నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పులను ప్రతిపాదించింది. ఇప్పటికే సిద్ధమైన ముసాయిదాపై మరోసారి అభిప్రాయాలను సేకరిస్తోంది. పాఠశాల స్థాయి విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు వారు చదివే తరగతులకు తగ్గట్టు-గా లేవని పలు నివేదికలు పేర్కొనడంతో.. ఆ అంతరాలను తగ్గించేందుకు నూతన జాతీయ విద్యావిధానాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

- Advertisement -

విద్యార్థులలో ఆశించిన అభ్యసన సామర్థ్యాలు లేకపోవడానికి ప్రాథమిక తరగతులకు ఏకోపాధ్యాయ లేక ఇద్దరు టీచర్ల బోధనే కారణంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో సబ్జెక్టు వారీగా టీచర్లను ఆయా తరగతుల్లో బోధించేలా చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లిష్‌ బోధనకు నిపుణులైన సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేయాలని, జిల్లాల విద్యాశాఖాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలిస్తున్న నేపథ్యంలో 1, 2 తరగతులకు, ఆ పై తరగతులకు వేర్వేరుగా సబ్జెక్టు టీచర్లు ఉండేలా చూడాలని ఆదేశించింది.

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నూతన విధానాన్ని అమలు చేసి, గుర్తించిన లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేలా పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బాధ్యతను మండల, జిల్లా స్థాయిల్లో విద్యాశాఖాధికారులు తీసుకుని, ఉపాధ్యాయులను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నూతన విద్యావిధానం అమలుపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక తరగతులను విభజించడం పాలనాపరమైన ఇబ్బందులనే కాక, బోధనపైనా ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో సమీక్షించిన తర్వాతే అమలు చేయాలని సూచిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement