Friday, April 26, 2024

మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం: ఏపీ మంత్రి మేకపాటి

వైమానికరంగంలో ఆంధ్రప్రదేశ్ అనేక ఆదర్శనీయ సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. వైమానిక రంగ అభివృద్ధికై రాష్ట్రాల సమన్వయంతో ఏర్పాటు చేసిన సదస్సు గురించి మాట్లాడుతూ..సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిండియా చొరవను మంత్రి మేకపాటి అభినందించారు. వైమానికరంగ ప్రగతికోసం ఇంధనంపై పన్నును 16 శాతం నుంచి 1 శాతానికి తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించారు. ప్రతి చోటుకీ వేగంగా వెళ్లగలిగే కనెక్టివిటీ, మూరుమూల గ్రామాలకు వెళ్లగల సకల రవాణా, రహదారి, ఇతర మార్గాల సదుపాయాలతో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.  అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఛాంపియన్ స్టేట్ లలో ఏపీ ఒకటి నిలిచిందన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, రహదారులతో అంతటా కనెక్టీవిటీ వంటి వనరులు సమృద్ధిగా ఉన్న ఏపీ కేంద్ర ప్రభుత్వానికి ఓ గ్రోత్ సెంటర్ అని పేర్కొన్నారు.

5 ట్రిలియన్ డాలర్ల ఎకనమీ సాధనలో, భారీ ఎగుమతుల ప్రోత్సాహంలో తామే టాప్ లో ఉన్నామన్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ లో స్థాపించిన కొత్త విమానశ్రయానికి 1847 సమయంలో బ్రిటీష్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన తొలి భారతీయుడు, స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుతో నామకరణం చేశామని గుర్తు చేశారు. కర్నూలు జిల్లాలోని విమానాశ్రయం ఏపీఏడీసీఎల్ ద్వారా, మరొకటి అనంతపురం జిల్లాలోని సత్యసాయి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో నిర్వహించబడుతున్నాయని మంత్రి మేకపాటి వివరించారు. ఏఏఐ ద్వారా ప్రకాశం జిల్లాలో ఎయిర్ స్ట్రిప్ లు నిర్మించబడుతున్నాయని, ఇవి 2022లో ప్రారంభించనున్నామని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 విమానాశ్రయాలు ఉన్నాయన్న మంత్రి.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో 5 పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నాయని చెప్పారు. వీటిలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సకలసదుపాయాలకు నెలవు అని పేర్కొన్నారు. బ్రిటీష్ కాలంలో అతిపెద్ద రన్ వేతో సేవలందించిన ప్రకాశం జిల్లాలోని దొనకొండలో విమానాశ్రయ పునరుద్ధరణకు ఆర్థిక సహకారం గురించి కేంద్ర మంత్రి వద్ద మంత్రి మేకపాటి ప్రస్తావించారు. మిగిలిన రాజమండ్రి, కడప దేశీయ విమానాశ్రయాలు.. కరోనా ముందు వరకూ 5 మిలియన్లకు పైగా ప్రయాణీకుల రద్దీ కలిగిన ఎయిర్ పోర్టులు అని వివరించారు. 12,135 ఎం.టీల సామర్థ్యంతో సరకు రవాణా చేశాయన్నారు.

కోవిడ్ సమయంలో వీటిపై చాలా ప్రతికూల ప్రభావం చూపాయన్న మంత్రి మేకపాటి.. ఏవియేషన్ పెట్టుబడులు పెంచాలనే ఆలోచనతో ఏపీ ఆ దిశగా ఏపీఏడీసీఎల్ పేరుతో ప్రత్యేక ప్రయోజనా వాహకాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రోడ్డు, రైలు, పోర్టుల వంటి సదుపాయాలన్నీ ఉన్న చోట పారిశ్రామిక, ఆర్థిక ప్రగతే లక్ష్యంగా మల్టీ మోడల్ కార్గో హబ్ లను ఏర్పాటు చేయడానికి ఏపీ అడుగులేస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ 2030 కల్లా పీపీపీ పద్ధతిలో వైమానిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యం పెట్టుకుందన్నారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా చొరవతో రాష్ట్రంలో కొన్ని డిఫెన్స్, ఏరోస్పేస్ ఆధారిత తయారీ యూనిట్లకు ఆసక్తిగా ఉందన్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బొడ్డువారిపాలెంలో మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ అల్యూమినియమ్ అలాయ్ తయారీ యూనిట్ ఉందన్నారు. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు బీఈఎల్ లో అత్యాధునిక నైట్ విజన్ పరికరాల ప్రాజెక్టు అని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని పాలసముద్రం బీఈఎల్ లో మిసైల్ ఇంటెగ్రేషన్ ఫెసిలిటీ అని చెప్పారు. ప్రకాశం జిల్లాలో భారత నేవీ ఆధ్వర్యంలో చేపట్టే  వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) ట్రాన్స్ మిషన్ సౌకర్యం కలదని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ట్రైనింగ్ సౌకర్యం ఉందన్నారు. భోగాపురంలో మెగా ఎరోట్రొపొలిస్ ప్రతిపాదించిన ఎయిర్ కార్గో కాంప్లెక్స్, ఎంఆర్ఓ ఫెసిలిటీ అని తెలిపారు.

- Advertisement -

విశాఖపట్రం కేంద్రంగా సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఉందన్న మంత్రి గౌతమ్ రెడ్డి.. డీఆర్డీవో ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని నాగాయలంక వద్ద మిసైల్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు జిల్లాలో డీఆర్డీవో సమక్షంలో నేషన్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ఉందన్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో ప్రపంచంలో అగ్రశ్రేణి శక్తులలో ఒకటిగా భారతదేశం నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే రాష్ట్రాలలో ఏపీని అగ్రభాగాన నిలుపుతామని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement