Monday, April 29, 2024

మా నాన్నకు ప్రాణహాని: హైకోర్టుకు జడ్జి రామకృష్ణ కుమారుడి లేఖ

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తన తండ్రికి ప్రాణహాని ఉందని జడ్జి రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ ఏపీ హైకోర్టుకు లేఖ రాశారు. జైలులో ఉన్న తన తండ్రి రామకృష్ణ బ్యారెక్‌లోకి అపరిచితుడిని పంపారని, అతడు తన తండ్రిని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. జగన్, పెద్దిరెడ్డిని ఎదిరించే మొనగాడివా అంతు చూస్తానని బెదిరించాడని తెలిపారు. తన తండ్రికి ప్రాణహాని ఉందని, కాబట్టి వారిద్దరినీ వేర్వేరు బ్యారెక్‌లలో ఉంచాలని ఆ లేఖలో కోరారు.

 వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ద్వేషం పెంచేలా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై అరెస్ట్ ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణ 42 రోజులుగా జైలులోనే ఉంటున్నారు. చిత్తూరు జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు.

మరోవైపు, రామకృష్ణ వ్యవహారాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రామకృష్ణ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆయన తనయుడు వంశీకృష్ణ భయపడుతున్నారని చెప్పారు. కాబట్టి రామకృష్ణకు జైలులో భద్రత కల్పించాలని కోరారు. జైలులో ఉన్న జడ్జి రామకృష్ణను బెయిలుపై విడుదల చేసి తగిన రక్షణ కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. తన తండ్రి ప్రాణాలకు జైలులో ముప్పు ఉందని ఆయన కుమారుడు వంశీకృష్ణ హైకోర్టుకు లేఖ రాశారని అన్నారు. జడ్జి రామకృష్ణ ప్రాణాలను కాపాడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement