Friday, April 26, 2024

Capital Amaravati: రైతుల రాజధానే కాదు.. ఏపీ ప్రజలందరిదీ: హైకోర్టు

రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టులో రెండోరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా అమరావతిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీ ప్రజలందరి రాజధాని అని వ్యాఖ్యానించారు. 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. రాజధాని అమరావతి.. విశాఖ, కర్నూలు సహా అందరిదీ అని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యం కోసం పోరాడడం అంటే కేవలం వాళ్ల కోసం పోరాడడం మాత్రమే కాదని, దేశ ప్రజలందరి కోసం పోరాడడమేనని చెప్పారు. ఆ స్వాతంత్ర్యం కేవలం సమరయోధులకు సంబంధించినది మాత్రమే కాదని, దేశ ప్రజలందరికీ చెందినదని సీజే మిశ్రా స్పష్టం చేశారు.

పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. అమరావతికి సంబంధించిన కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అమరావతి కోసం రైతులు తమ జీవనోపాధిని త్యాగం చేశారని చెప్పారు. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి కోసం వెలకట్టలేని త్యాగాలు చేశారని న్యాయవాది శ్యామ్ దివాన్ ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. వీలైనంత త్వరగా అమరావతిని అభివృద్ధి చేయాలని.. గత ప్రభుత్వం ఇచ్చిన న్యాయబద్ధమైన హామీలను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. రాజకీయ విద్వేషాలతో అమరావతిని ప్రభుత్వం ఘోస్ట్ క్యాపిటల్‌గా ప్రభుత్వం మార్చేసిందని వాదించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp,

 https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement