Friday, April 26, 2024

ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు.. 36 గంటల పాటు చంద్రబాబు నిరసన దీక్ష

AP POLITCS: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, జిల్లా కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ మూక దాడికి వ్యతిరేకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టనున్నారు. “ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు” పేరుతో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు (36 గంటల పాటు) కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేయనున్నట్టు మీడియాకు తెలిపారు.

‘‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. ఫ్యాక్షనిజానికి అధికారం తోడయ్యింది. దీనిలో పోలీసులు అంతర్భాగమయ్యారు. ప్రజాస్వామ్యం నశించింది. ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూక దాడులకు సీఎం జగన్మోహన్ రెడ్డి తెరతీశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. అక్కడున్న టీడీపీ నేతలు, సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కుట్రతో పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేశారు. కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికి పోయేలా దాడులకు తెగబడ్డారు. నిన్నటి రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ముఖ్యమంత్రి, డీజీపీ ప్రోద్బలంతోనే ప్రతిపక్ష పార్టీ నేతలపై భౌతిక దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం దమనకాండను మొదటినుంచీ కొనసాగిస్తోంది. దీనిని నిలువరించాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ప్రతి పౌరునిపై ఉంది. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు ప్రజలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలిసి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement