Monday, April 29, 2024

AP: విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి మృతి

అనంత పురం, ప్రభ న్యూస్ బ్యూరోః అనంతపురం జిల్లా కంబదూరు మండలం కొత్త ఇపార్సపల్లి లో ఆదివారం ఉదయం విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి (28) మృతి చెందారు. సంక్రాంతి పండుగ పూట ఇంట్లో నీళ్లు ఖాళీ కావడంతో కరెంటు మోటార్ పెట్టడానికి స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది.

షాక్ తగిలిన వెంటనే ప్రశాంతి వెనుక భాగంలో ఉన్న సిమెంట్ తొట్టపై పడింది. మెదడు భాగం లో తీవ్రగాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కన్న కూతురుకి విద్యుత్ షాక్ తగిలిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. కంబదూరు మండలం తిమ్మాపురం పంచాయతీ ఓబుగానపల్లి సచివాలయం-2 లో పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న ప్రశాంతి బీఎస్సీ కంప్యూటర్స్ కోర్స్ చేసింది . ఎంతో ఉన్నత ఆశయంతో ఉద్యోగంలో చేరి కుటుంబ పోషణ సాగిస్తున్న సమయంలో మృత్యువు వెంటాడడంతో కుటుంబంలో విషాదం నెలకొంది . జరిగిన సంఘటనను తలుచుకుని తల్లిదండ్రులు అశ్వర్త నారాయణ, రామలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement