Sunday, April 28, 2024

AP: మృతదేహంతోనే 18 కిలోమీటర్ల జ‌ర్నీ..

అనంతపురంలో యాక్సిడెంట్‌
బైక్‌ను వేగంగా ఢీకొట్టిన కారు
ఎగిరి బానెట్‌పై పడి చనిపోయిన బైకర్
ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం
గ్రామ‌స్తులు నిల‌దీయడంతో కారు వ‌దిలేసి ప‌రార్‌
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జ‌రిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీ కొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి బైక్ నడుపుతున్న వ్యక్తి ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. తీవ్రగాయాలతో అక్క‌డే చనిపోయాడు. అయితే.. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బానెట్‌పై మృతదేహం ఉన్న విష‌యాన్ని కూడా గమనించకుండా అలాగే 18 కిలోమీట‌ర్లు వెళ్లాడు. కారుపై మృతదేహాన్ని చూసి గ్రామస్తులు ఆపడంతో కారును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.

మెకానిక్ కుటుంబంలో విషాదం..
కూడేరు మండలం చోళ సముద్రానికి చెందిన జిన్నే ఎర్రి స్వామి(35) ట్రాక్టర్ మెకానిక్.. భార్య మంజుల, ఇద్దరు పిల్లలతో కలిసి అనంతపురంలో స్థిరపడ్డాడు. ఆదివారం సిద్ధరాంపురం వెళ్లిన అత‌ను రాత్రి 10గంటల ప్రాంతంలో బైక్‌పై తిరుగుప్రయాణమ‌య్యాడు. ఈ క్రమంలో వై కొత్తపల్లి సమీపంలో కళ్యాణదుర్గం వైపు వెళుతున్న ఓ కారు స్వామి బైక్‌ను ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో స్వామి ఎగిరి కారు బానెట్ పై పడి చనిపోయాడు.

గ్రామస్తులు ఆప‌డంతో కారు వ‌దిలేసి..
మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ ఈ ప్రమాదాన్ని గుర్తించనేలేదు. బానెట్ పై మృతదేహంతోనే కారును 18 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. కారుపై మనిషి పడి ఉండడం గమనించిన హనిమిరెడ్డిపల్లి గ్రామస్థులు కారును ఆపారు. దీంతో కిందికి దిగిన డ్రైవర్.. బానెట్ పై స్వామి మృతదేహాన్ని గమనించాడు. కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement