హైదరాబాద్ – వేరుశనగ రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కనీస మద్ధతు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎంఎస్పీ ఇస్తారా లేదా బోనస్ ఇస్తారా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… . వేరుశనగ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ కౌన్సిల్ లో ఈ అంశాన్ని కవిత ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జడ్చర్ల, అచ్చంపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో వేరశనగ రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారని తెలిపారు.
ఆ పంటకు క్వింటాలుకు రూ.6377 కనీస మద్ధతు ధర ఉండగా… వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి రూ. 5 వేలలోపు కొనుగోలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతులను వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పంటలకు కనీస మద్ధతు ధర కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వేరుశనగ పంటకే కాకుండా అన్ని పంటలకు కనీస మద్ధతు ధర కంటే తక్కువ ధర ఉంటే రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, కాబట్టి కనీస మద్ధతు ధర కల్పిస్తారా లేదా బోనస్ ఇస్తారా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, వేరుశనగ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
రాజీవ్ విగ్రహం – పునరాలోచించండి..
సచివాలయ ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తేందుకు శాసనమండలి చైర్మన్ అనుమతి కోరారు. సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని అంటూ ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి ఆయన చేసిన సేవలకు మనకు ఎనలేని గౌరవం ఉందని, కానీ తెలంగాణకు తెలంగాణ తల్లి చాలా ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించాలని, ముందుగా అనుకున్నట్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.