Wednesday, May 8, 2024

భర్తను కత్తితో పొడిచి చంపేసిన భార్య!

భార్యాభర్తల మధ్య చాలా కాలంగా గొడవ జరుగుతోంది. అది కాస్త ముదిరి వివాదంగా మారింది. నిత్యం ఇదే లొల్లి ఏంటన్న కోపంతో విచక్షణ కోల్పోయిన భార్య.. భర్తను కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన హైదరాబాద్‌ లోని సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళ్లితే.. నల్గొండ జిల్లా బుసిరెడ్డిగూడ గ్రామానికి చెందిన మురళీధర్‌ రెడ్డి, మౌనిక దంపతులు. 11 ఏళ్ల క్రితం హైదరాబాద్ కి వలస వచ్చి.. సరూర్‌ నగర్‌ లో నివాసముంటున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ప్రైవేటు జాబ్ చేస్తున్నారు. మౌనిక డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఈ నెల 5న గుంటూరుకు వెళ్లి 6వ తేదీన ఇంటికి చేరుకుంది. అయితే, ఆమె ఇంట్లో లేని సమయంలో స్థానికంగా చెడుగా ప్రచారం చేశాడంటూ తండ్రి మురళీధర్‌రెడ్డిపై కుమారుడు తల్లికి ఫిర్యాదు చేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె భర్తను నిలదీసింది. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మౌనిక ఇంట్లో ఉన్న కూరగాయల కత్తితో భర్త మెడపై పొడిచి హత్య చేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement