Sunday, April 28, 2024

Vote for Note – ఓటుకు నోటు కేసు – రేవంత్ కు సుప్రీం నోటీస్…

హైద‌రాబాద్ – ఓటుకు నోటు కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గతంలో సుప్రీంలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు భుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలని సూచనలు చేసింది.

కాగా, గతంలో ఈ కేసులో రేవంత్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్‌సన్‌ను రేవంత్ రెడ్డి కలిసి.. డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలు శిక్షను కూడా అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వ‌చ్చారు. అయితే, మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా నిలిచింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement