Monday, April 29, 2024

Leaked : టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో మరో ఇద్దరి అరెస్టు

తిమ్మాపూర్ ప్రభ న్యూస్ : ప్రశ్నపత్రాల పేపర్ లీకేజీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి తాకింది. నియామక పరీక్షలో అర్హత సాధించి ఉద్యోగం సాధించడానికి కొందరు అక్రమార్కులు అడ్డదారులు తొక్కడం.. అది బయటకు రావడంతో బండారం బయటపడింది. పేపర్ లీకేజీ వ్యవహారం దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. గత కొంతకాలంగా సిట్ బృందం దర్యాప్తు కొనసాగిస్తూ అందులో సూత్రధారులను, పాత్రధారులను అరెస్ట్ చేసింది. సిట్ బృందం జిల్లాలోని తిమ్మాపూర్ మండలంకు వచ్చి ఎంక్వయిరీ చేసింది. మండలంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చి ఒకరోజు ఉండి విచారణ చేపట్టింది. లీకేజీ వ్యవహారంకు ఇద్దరు లెక్చరర్లకు సంబంధం ఉందనే కారణంతో సిట్ బృందం వారిని పిలిచి మాట్లాడి వివరాలను సేకరించారు.

దర్యాప్తులో భాగంగా అన్ని వివరాలు సేకరించిన అనంతరం స్థానిక పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. తిమ్మాపూర్ మండలంలోని ఇంజనీరింగ్ కళాశాలకు సిట్ బృందం ప్రవేశించి దర్యాప్తు చేసిన విషయం అంతా రహస్యంగానే కొనసాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు కళాశాలలో ప్రత్యేక బ్లాక్ లో సిట్ అధికారులు విచారణ చేసిన బయటకు రాలేదు. ఇద్దరు లెక్చరర్లను విచారించిన సిట్ అధికారులు కేవలం స్థానిక పోలీసులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే సమాచారమిచ్చినట్లు బయటపడింది. ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు లెక్చరర్లలో ఒకరు ఫిజికల్ డైరెక్టర్ కాగా, మరొకరు మీడియా కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తూనే డిప్లమో విద్యార్థులకు లెక్చరర్ గా పనిచేసినట్లు తెలిసింది. ఇద్దరి పాత్ర ఏమిటనేది విచారణలో భాగంగా లెక్చరర్ విశ్వ ప్రకాష్ వెంకటేశ్వర్లు రూ.10 లక్షలు తీసుకొని ప్రశ్నాపత్రాల లీకేజ్ కి సహకరించినట్లు తెలిసి విచారించి అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement