Sunday, May 19, 2024

Twit – నిన్న మతం , నేడు కులం – ఇదే కదా మోడీజీ మీ నీచ రాజకీయాలు – కేటీఆర్

హైదరాబాద్ – “నిన్నటి దాకా మత రాజకీయం చేశారు.. నేడు కుల రాజకీయానికి తెర తీశారా ??” అని ప్ర‌ధాని మోడీని ప్ర‌శ్నించారు. పదేళ్ల మీ హయాంలో దేశంలోని బీసీలకు మిగిలింది వేదన, అరణ్య రోదనే అని పేర్కొన్నారు. కనీసం బీసీల జనగణన కూడా చేయని పాలన అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన ప్ర‌ధాని నరేంద్ర మోడీపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎదురుదాడికి దిగారు. బీసీ ముఖ్య‌మంత్రి అంశాన్ని లేవ‌నెత్తిన బీజేపీతో బీసీల‌కు ఒరిగిందేమీ లేద‌ని అన్నారు.

తెలంగాణ ఢిల్లీ నాయ‌కులు రావ‌డం, బీఆర్ఎస్ పై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని ఖండించిన కేటీఆర్.. “కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం మీది.. అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టీయే. బీసీలంటే మీ దృష్టిలో బలహీనవర్గాలు కానీ.. మాకు బీసీలంటే బలమైన వర్గాలని” అన్నారు “ప్ర‌ధాని మోడీ జీ.. రాహుల్ గాంధీ వచ్చి మమ్మల్ని మీ బీ టీమ్ అంటారు. మీరొచ్చి మేము కాంగ్రెస్ సీ టీమ్ అంటారు. అయితే, మేం బీజేపీకి బీ టీమ్ కాదు.. కాంగ్రెస్ కు సీ టీమ్ కాదని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల కోసం ముందుకు సాగే త‌మ‌ది ముమ్మాటికీ టీ టీమ్.. తెలంగాణ టీమ్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా, ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ త‌మ‌ద‌ని అన్నారు..

రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాదు అనేక పథకాలిచ్చిన ప్రభుత్వం త‌మ‌ద‌ని చెప్పారు. పేప‌ర్ లీకేజీల గురించి ప్ర‌స్తావిస్తూ.. “టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిందే మీ బీజేపీ నేతలు.. నిందితులతో వేదిక పంచుకుని.. మాపై నిందలా ?? దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కాంగ్రెస్ నే మించిపోయింది.. మీ బీజేపీ ప్రభుత్వం. ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని మీరు..రెండుసార్లు సంకల్పించిన మా సర్కారుపై విమర్శలు చేయడం నిజంగా విడ్డూరంగా ఉంది అని మంత్రి కేటీఆర్ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితిగా పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement