Saturday, April 27, 2024

TS – ఎమ్మెల్యే లాస్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనుకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు

కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

లాస్య నందిత మృతిపట్ల మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. చిన్న వయస్సులో లాస్య నందిత అకాల మరణం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నందిత అకాల మరణం బాధాకరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. యువ ఎమ్మెల్యే ఆకస్మిక మరణం కలచివేసిందని మంత్రి ఉత్తమ్‌ అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement