Sunday, April 28, 2024

TS: బీజాపూర్ ఎన్ కౌంటర్లకు నిరసనగా.. బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ

ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ పార్టీ ఇవాళ‌ బంద్‌కు పిలుపునిచ్చింది. బీజాపూర్ జిల్లా ఎన్ కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్‌ నిర్వహించ తలపెట్టింది.. తెలంగాణ, ఏపీ, ఒడిషా, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర పరిధిలో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్‌కు పోలీసులు పిలుపునిచ్చారు. మావోయిస్ట్‌ల ఏరివేత టార్గెట్‌గా భారీగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వ‌హిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ కాల్పుల మోతతో ఛత్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపూర్‌ దద్దరిల్లింది. వరుస ఎన్‌కౌంటర్లతో విలవిల్లాడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో సెంట్రల్ రీజియన్ బంద్‌కు పిలుపునిచ్చింది.

తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దు దండకారణ్యం యుద్ధ భూమిగా మారింది. ఒక ఎన్‌కౌంటర్ మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. పెద్దగా కాలవ్యవధి కూడా లేకుండానే దండకారణ్యంలో తుపాకుల మోత మోగుతోంది. మొన్నటికి మొన్న ఛత్తీస్‌గడ్ దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్… ములుగు జిల్లా సరిహద్దు కర్రి గుట్టల వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీస్ బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ క్రమంలోనే ఏకే 47.. లైట్ మెషీన్ గన్,12 బోర్ తుపాకులను సోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని ధృవీకరించారు. తెలంగాణ గ్రే హౌండ్స్… ఛత్తీస్ గడ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ సరిహద్దులో పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రెండు వారాల వ్యవధిలో మూడు భారీ ఎన్ కౌంటర్స్ జరిగాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ ఎన్ కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్ జిల్లా కోర్చోలి ఎన్‌కౌంటర్ లో 13మంది మావోయిస్టులు.. సరిహద్దు కర్రిగుట్టల వద్ద ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement