Friday, May 3, 2024

MBNR: గణనీయంగా పెరిగిన పంటల సాగు విస్తీర్ణం.. మంత్రి నిరంజన్ రెడ్డి

మహబూబ్ నగర్, అక్టోబర్ 7 (ప్రభ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అనుకూల విధానాల వల్ల రాష్ట్రంలో సాగువిస్తీర్ణం పెరిగి, పంటల విస్తీర్ణం పెరిగిందని దీనివల్ల వ్యవసాయం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కోటి 20లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ గోదామును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉండిందని, అలాంటిది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సామర్ధ్యాన్ని 70 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకువెళ్లామని తెలిపారు.

మార్కెటింగ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్లతో పాటు, సహకార సంఘాలు బలోపేతం అయినందున రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా సైతం గోదాముల నిర్మాణాన్నీ చేపట్టడం జరిగిందని, ఇందుకు నాబార్డు తక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే జడ్చర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ గోదాం నిర్మాణం చేపట్టడం జరిగిందని, దీనివల్ల ఈ ప్రాంత రైతులకు, వారు పండించిన పంటలను నిలువ చేసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల నిలువ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నట్టు వెల్లడించారు. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పండించిన పంటలు ఎక్కడికక్కడే నిల్వ చేసుకునేందుకు సాధ్యమైనంత దగ్గరలో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మిస్తున్నామని, ఇది రైతులకు ఒక మంచి అవకాశమన్నారు. జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, డీసీసీబీ అధ్యక్షులు నిజాం పాషా, జడ్చర్ల పి ఏ సి ఎస్ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ అధ్యక్షులు వాల్య నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షులు జంగయ్య ,మున్సిపల్ చైర్మన్ దోరేపల్లి లక్ష్మి ,కౌన్సిలర్లు లత, నవనీత,సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement