Saturday, May 18, 2024

తెలంగాణ విద్యార్థులను వెనక్కి ర‌ప్పించండి.. విదేశాంగ శాఖ మంత్రికి ఎంపీ రంజిత్‌రెడ్డి లేఖ‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ర‌ష్యా-ఉక్రెయిన్​ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలంగాణ‌​కు చెందిన విద్యార్థులను క్షేమంగా వెన‌క్కి తీసుకొచ్చేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయ‌శంక‌ర్‌కు గురువారం లేఖ రాశారు. విద్యార్థులను రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ ఎయిర్​పోర్టులో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారని రంజిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్​ వచ్చేందుకు విమానం టికెట్ బుక్​ చేసుకున్న వారంతా ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. అంతలోనే యుద్ధం ప్రారంభం కావడంతో ఉక్రెయిన్​ తన గగన తలాన్ని మూసివేసింద‌ని, గగనతలాన్ని డేంజర్ ​జోన్​గా ప్రకటించిందని లేఖలో పేర్కొన్నారు. ఎయిర్​పోర్టు నుంచి బయటకు వెళ్లే దారులను కూడా మూసివేయడంతో విద్యార్థుల‌ను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేయాల‌ని ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర మంత్రిని అభ్య‌ర్థించారు. తెలంగాణ‌ విద్యార్థులందరినీ స్వరాష్ట్రానికి రప్పించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement