Sunday, May 19, 2024

తెలంగాణ మతసామరస్య కేంద్రం, ప్రగతిశీల సాహిత్యం మరింత రావాలి: జూలూరు

మనిషిని మనిషి ప్రేమించే ప్రేమమయమైన సమాజాన్ని నిర్మించేందుకు తెలంగాణ కవులు, రచయితలు ఎప్పుడూ ముందుంటారని.. అదే ఈ సమాజానికి రక్షణగా నిలుస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. తెలంగాణ భాష మండలి ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన “తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం” అనే అంశం పై ఒకరోజు రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. మనుషులను మతం పేరున విభజించే విధ్వంసకర భావజాలానికి వ్యతిరేకంగా ప్రగతిశీల సాహిత్య సృష్టి కుప్పలు తెప్పలుగా రావాల్సి ఉందన్నారు. గంగాజమునా తెహజీబ్ సంస్కృతిని నిలబెట్టిన మహోన్నత తెలంగాణ మానవీయ మట్టి చరిత్రకు వారసులుగా ఈతరం కవులు కదలాలని పిలుపు నిచ్చారు.

మానవతావాద మహాకూడలైన సబ్బండ వర్ణాల సమైక్య సంస్కృతిని చెక్కుచెదరకుండా చూడాల్సిన భాద్యత సృజనశీలురైన రచయితలందరి పైనా, ఉందన్నారు. ఇక ఇప్పుడు మత ఉన్మాద ఉద్రేక విచ్ఛిన్నకర వాదాలను తిప్పికొట్టే సాహిత్యం ప్రవాహావేగంతో పెల్లుబికి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మనుషుల మధ్య కట్టే కులమత ఆధిపత్యవాదాల గోడలను కూల్చవలసిన భాద్యత తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగాలదే అని జూలూరు నొక్కి వక్కిణించారు. ఈ సదస్సుకు విచ్చేసిన ప్రసిద్ద కవులు, కళాకారులు, అధ్యాపకబృందానికి రాష్ట్రసదస్సు సంచాలకులు తెలుగు భాషా సాంస్కృతిక మండలి అధ్యాక్షుడు ఖైరతాబాద్ తెలుగు శాఖ అధ్యక్షుడు డా. గంట జలందర్ రెడ్డి స్వాగత వచనాలు మాట్లాడుతూ.. తెలంగాణ సాహిత్య విశిష్టతను విశ్లేషించి చేప్పారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కవి డా. టి చమన్ తెలగాణ భాష సాహిత్య రంగాల కృషిని వివరించారు. విశిష్ట అతిధిగా విచ్చేసిన సామిడి జగన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య మూలాలని ప్రాచీన సాహిత్యం నుంచి అధునిక సాహిత్యం వరకు వివరిస్తూ పరిశోదనాత్మకమైన ప్రసంగం చేశారు. సదస్సులో కళా రంగాలను గురించి ప్రముఖ ఆర్టిస్ట్ ఎం.వి రమణ రెడ్డి ప్రసంగించారు. కళశాల ప్రిన్సిపల్ డా.డి. రాజేంద్ర ప్రసాద్, కళాశాల అధ్యాపకురాలు నిదాన కవి నీరజ, రమణ నంద తీర్థ గ్రామీణ అభివృద్ది శిక్షణ సంస్థ డైరెక్టర్ డా ఎన్ కిశోర్, వైస్ ప్రిన్సిపల్ డా. విజయ లక్ష్మీ, డా. ఎం. వాణి, బండారి ప్రేమ్ కుమార్, డా టి కాంతా రావు, డా. ఎం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement