Thursday, May 16, 2024

టీ పీసీసీ చీఫ్‌ ఏకపక్షంగా నిర్ణయాలు.. సమాచారం ఇవ్వడం లేదు: కాంగ్రెస్‌ సీనియర్ల భేటీలో చర్చ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు సోమవారం మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. టీ పీసీసీ తీసుకుంటున్న నిర్ణయాలు సీనియర్లకు చెప్పకుండానే.. ఏకపక్షంగా ఉంటున్నాయని ఈ సమావేశంలో చర్చించారు. టీ పీసీసీ రేవంత్‌రెడ్డి తీరుపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో ఓసారి టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో సమావేశమైన నాయకులు, ఇప్పుడు రెండోసారి శశిధర్‌రెడ్డి నివాసంలో భేటీ కావడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏఐసీసీలో జరుగుతున్న తాజా పరిణామాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లోని రాజకీయ పరిణామాలపై సమాచారం. ఆదివారం సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాలు మద్దతు తెలపడంతో పాటు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఏపకక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.

అయితే వీరంతా పీసీసీకి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలా..? లేక పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలా..? అనే అంశంపై ఒక నిర్ణయానికి రానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ పార్టీ అని, ప్రాంతీయ పార్టీ కాదనే అంశాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నామని, మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సీనియర్లను అవమానించే విధంగా వ్యవహారించడం తగదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వీహెచ్‌, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, పార్టీ సీనియర్లు నిరంజన్‌, శ్యామ్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే చర్చించాం : శ్రీధర్‌బాబు
మాజీ మంత్రి మర్రి శశధర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా పలిచారని, సభా సమావేశాలు జరుగుతున్నందున ఒక్కసారి వచ్చిపోవాలని ఆహ్వానించారని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చర్చ జరిగిందన్నారు. ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే చర్చ జరిగిందన్నారు. తనకు వేరే పని ఉన్నందున మధ్యలోనే వెళ్లిపోతున్నట్లు చెప్పారు.

పార్టీ పరిణామాలపై చర్చించాం : వీహెచ్‌ , శశిధర్‌రెడ్డి
పార్టీలో సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలు, ఇతర పరిణామాలపై చర్చించామని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు తెలిపారు. సీనియర్లకు జరుగుతున్న అవమానాలపై హై కమాండ్‌ దృష్టికి తీసుకెళ్లుతామని వీహెచ్‌ తెలిపారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభం తీసుకురావాలనే విషయంపై చర్చించినట్లు మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి అన్నారు. పార్టీలో సంస్థాగతంగా మార్పులు జరగాలని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ప్రజల విశ్వాసాన్ని ఏ విధంగా పొందుతుందనే నిర్ణయాలు ఉండాలన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న వారు.. పార్టీకి అనుబంధంగా ఉన్నారా..? లేదా..? అనేది చూడాలన్నారు.

సీడబ్ల్యూసీ సమావేశంపై చర్చించాం : జగ్గారెడ్డి
కాంగ్రెస్‌కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పని చేయాలనే దానిపై చర్చించినట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బయట జరుగుతున్నట్లుగా ఎలాంటి ఊహాగానాలకు తావులేదన్నారు. ఆదివారం ఢిల్లిdలో సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంపై చర్చించినట్లు తెలిపారు. సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీల నాయకత్వం ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. పార్టీతో కొన్ని కొన్న ఏళ్లుగా అనుబంధంగా కొనసాగుతున్న నేతలంగా చర్చించుకున్నట్లు తెలిపారు. సీనియర్‌ నేత వీహెచ్‌ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని, అవి పార్టీ అంతర్గత విషయాలని జగ్గారెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement