Friday, May 3, 2024

తెలంగాణ విముక్తి కోసం ఆఖరి పోరాటం: రేవంత్

తెలంగాణ విముక్తి కోసం ఆఖరి పోరాటం చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం ఇందిరా పార్క్ లో నిర్వహించిన అఖిలపక్ష మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పోడు భూముల కోసం కొట్లాట మొదలైందని అన్నారు. మహిళలు అని కూడా చూడకుండా డెకాయిట్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. భూములతో పాటు తమ ప్రాణాలు కూడా తీసుకోండని గిరిజనులు వాపోతున్నారని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. నలుగురి చేతుల్లో బంధీ అయిందని మండిపడ్డారు. తెలంగాణ విముక్తి జరగాలంటే గులాబీ చీడ వదిలించుకోవాలని అన్నారు.

గల్లీలోని కేడీ.. ఢిల్లీలో ఉన్న మోడీ ఇద్దరూ ఒకటేనని రేవంత్ వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రూ.24 లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. నల్లధనం బయటకు తెస్తానని చెప్పిన మోదీ.. ప్రతి పేద కుటుంబానికీ రూ.15 లక్షలు బాకీపడ్డారన్నారు. ప్రధాని మోదీ చాయ్ అమ్మిన రైల్వే స్టేషన్.. కాంగ్రెస్ పార్టీ కట్టిందేనని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం రైళ్లు అమ్ముతోందని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను రూ.6 లక్షల కోట్లకు అమ్ముతున్నారని చెప్పారు. మేము ఇద్దరం.. మాకు ఇద్దరు అనే రీతిలో దేశాన్ని పట్టి పీడిస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement