Sunday, April 28, 2024

Delhi | పెండింగ్ సమస్యలు పరిష్కరించండి.. సీఎస్ శాంతికుమారి ఢిల్లీ పర్యటన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె రాష్ట్రంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలను సోమవారం పలువురు కేంద్ర కార్యదర్శులను కలిసి వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలానందన్, కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌లతో శాంతికుమారి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులివ్వాలని కోరారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి కండ్లకోయ ఓఆర్‌ఆర్ వరకు, ప్యారడైజ్ నుంచి కరీంనగర్, రామగుండం మార్గంలోని ఓఆర్‌ఆర్ వరకు నిర్మించతలపెట్టిన రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి, అదేవిధంగా మెహదీపట్నం జంక్షన్‌లో ప్రతిపాదిత స్కైవాక్ నిర్మాణ పనులకు అవసరమైన 150.39 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు చేయాలని సీఎస్ శాంతికుమారి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ను కోరారు.

రక్షణ శాఖ భూములకు సరిపడా ప్రత్యామ్నాయ భూములను కూడా అందిస్తామని ఈ సందర్బంగా ఆమె స్పష్టం చేశారు. సీఎస్ చేసిన విజ్ఞప్తులపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి స్పందించారు. ఈ విషయానికి సంబంధించిన వివరాలను తెప్పించుకొని త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశాల్లో శాంతికుమారితో పాటు రాష్ట్ర ప్రభుత్వ రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, తెలంగాణా భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.

అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్‌ను సీఎస్ శాంతికుమారి కలిశారు. జాతీయ వన్య ప్రాణి సంరక్షణ బోర్డు లో పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన 60 ప్రతిపాదనలకు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, పీఎంజీఎస్‌వై పనులకు త్వరితగతిన అటవీ శాఖ అనుమతులు ఇవ్వడానికి నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ కమిటీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. అదేవిధంగా కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో కూడా శాంతికుమారి సమావేశమయ్యారు. రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆమె కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement