Sunday, April 28, 2024

Bhadradri : రామ‌య్య క‌ల్యాణం… క‌డుక‌మ‌నీయం

భధ్రాద్రిలోని మిథిలా మండ‌పంలో
వైభ‌వంగా శ్రీ సీతారాముల క‌ల్యాణం
అబిజీత్ ల‌గ్నంలో సీత‌మ్మ మెడ‌లో మూడు ముళ్లు
క‌నులారా వీక్షించి పుల‌కించిన భ‌క్త జ‌నం
సీత‌మ్మ‌కు సారే స‌మ‌ర్పించిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
రేపు లోక క‌ల్యాణ రాముడికి రాజ్య ప‌ట్టాభిషేకం

భద్రాచలం: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుక నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల నడుమ అభిజిత్‌ లగ్నంలో కల్యాణ క్రతువును వేదపండితులు పూర్తిచేశారు. భద్రాచలం పుర వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్‌ శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

కాగా, తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు.. రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు. తర్వాత కల్యాణ మూర్తులను పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల మధ్య మిథిలా మైదానంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు.

- Advertisement -

రజత సింహాసనంపై సీతారామచంద్ర స్వాములను ఆసీనులను చేశారు. తిరువారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించి మండప శుద్ధి చేశారు. ‘యుంజానహః ప్రథమం’ అనే మంత్రాని పఠిస్తూ వేద పండితులు ప్రజా సంపతర్థ్యం ‘శ్రీయం ఉద్వాః హిష్షే’ అన్న సంకల్పంతో స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి కన్యావరణలు జరిపారు. మోక్షబంధం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ గావించారు. వధూవరుల వంశ గోత్రాలకు సంబంధించి ప్రవరలు వినిపించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పాదక స్నానం జరిపి వరపూజ కార్యక్రం జరిపారు. కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి ధరింపజేశారు.

అర్చక స్వాములు స్వామి వారికి నూతన వస్త్రాలను అలంకరించారు. అభిజిత్‌ లగ్నం సమయంలో సీతారాముల ఉత్సవమూర్తుల శిరసుపై జీలకర్రబెల్లం ఉంచి.. అనంతరం భక్తరామదాసు చేయించిన మంగళ సూత్రాలతో సూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్వామి వారి కల్యాణ క్రతువు కొన‌సాగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జ‌రిపించారు వేద పండితులు.

కల్యాణ వేడుకలో వేలాది మంది భక్తులు వీక్షించి పరవశించి పోయారు. కల్యాణం జరిగిన మిథిలా మైదానంతో ఆలయ పరిసరాలన్నీ రామనామస్మరణతో మార్మోగాయి. కల్యాణోత్సవంలోడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ పీఎస్‌ నరసింహా, హైకోర్ట్ జడ్జి భీమపాక నగేష్రా రామయ్య పాల్గొన్నారు. కల్యాణ వేడుక సందర్భంగా మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టాభిషేక కార్యక్రమం జరుగనున్నది.

ఇక స్వామి వారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారురు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాల పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేశారు. 2వేల మంది పోలీసులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్యూఆర్ కోడ్‌తో భక్తులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement