Wednesday, May 1, 2024

Powrer పై అసెంబ్లీ లో సిగ‌ప‌ట్లు – జ‌గ‌దీష్ రెడ్డి – కోమ‌టిరెడ్డిల మ‌ధ్య లడాయి…

హైద‌రాబాద్ – తెలంగాణలో విద్యుత్‌ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ముందుగా యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో 10 వేల కోట్లను జగదీశ్‌ రెడ్డి తిన్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌ రెడ్డి ధీటుగా స్పందించారు .

ముందుగా కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ, ఫ్రీ కరెంట్ పెటెంట్ కాంగ్రెస్ దే అని అన్నారు . బీఆర్ఎస్ నేతలకు ట్రాన్స్ కో, జెన్ కో మాజీ చైర్మ‌న్ ప్రభాకర్ రావు దోచిపెట్టారన్నారు. విద్యుత్ రంగంలో అవకతవకలపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. దొంగలు, అవినీతి అంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు. ఎవరు ఎంత తిన్నారో అంత కక్కిస్తాం.. వదిలేస్తామా అన్నారు. టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారన్నారు. బీఆర్ఎస్ 24 గంటల విద్యుత్ ఇచ్చిందనేది పచ్చి అబద్ధమన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రూ.20వేల కోట్ల స్కాం జరిగిందన్నారు. ఇందులో జగదీష్ రెడ్డి రూ.10వేల కోట్లు తిన్నారన్నారు.

దీనికి స్పందించిన జగదీష్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమన్నారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీశ్‌ రెడ్డి కోరారు. ఆ విచారణలో దోషులు దొరికితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. తప్పకుండా ఈ విషయం తేలాలని అన్నారు. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్నానని.. కానీ ఏ ఒక్కరోజు కూడా రియాక్ట్‌ కాలేదని చెప్పారు. ఇవన్నీ పనికిమాలిన మాటలు.. అర్థం లేని.. ఆధార రహితమైన మాటలు అని అన్నారు. ఇవన్నీ రికార్డుల్లోకి రావాలనే ఇన్ని రోజులు వెయిట్‌ చేశానని.. ఇవాళ రికార్డుల్లోకి వచ్చాయని అన్నారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. మూడు అంశాలపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement