Thursday, May 2, 2024

TS: ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలి…మంత్రి వెంక‌ట్‌రెడ్డి

నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి పాల్గొన్నారు.తెల్లవారు జామున నకేరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మంత్రి చెర్వుగట్టులో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి మళ్లీ రాకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే మూడు నెలల్లో బ్రాహ్మణ వెళ్ళేంల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తారని, మొదటి విడతలో 60 వేల ఎకరాలకు నీటి విడుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

- Advertisement -

అదే రోజు మహాత్మాగాంధీ యూనివర్సిటీ, చెర్వుగట్టులో ముఖ్యమంత్రి సమీక్ష ఉంటుందన్నారు. చెర్వుగట్టుకు రెండో ఘాట్ రోడ్డు, భక్తులు నిద్రించేందుకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే కాలంలో బ్రాహ్మణ వెళ్ళేంల , ఎస్ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించి పేదల గుండెల్లో ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కాగా స్వామి వారి కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement