Monday, April 29, 2024

TS: టూరిస్ట్ అభ్యర్థిని కాదు.. స్థానిక సేవకుడిని…కొప్పుల ఈశ్వర్

సుల్తానాబాద్ (ఆంధ్రప్రభ) : టూరిస్ట్ అభ్యర్థిని కాదని, స్థానిక ప్రజల సేవకుడినని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆన్నారు. శుక్రవారం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్థానికంగా వున్న వ్యాపార సముదాయాలను కలియ తిరిగి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ… పెద్దపల్లి నియోజకవర్గం నుండి తనను బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని, గతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు అనేక సేవలందించానన్నారు.

ఈ ప్రాంత కుమ్మరి కుంట వాసుడనని ఉద్యోగ రీత్యా గోదావరిఖనిలో పుట్టి పెరిగానన్నారు. ఇక్కడి సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని గతంలో మంత్రిగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. తాను టూరిస్ట్ అభ్యర్థిని కాదని స్థానిక అభ్యర్థిని ప్రజల కష్టాల్లో భాగస్వామ్యమై వారి బాగోగులు చూసుకుని ఆప్తుడుగా నిలిచి సేవలందిస్తానన్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి అపర కుబేరులని తాను కార్మిక కుటుంబానికి చెందిన వాడనన్నారు. ప్రజలు తమతో ఉండే నాయకుడిని ఆదరించి అభివానించాలని వేడుకొన్నారు. వచ్చి పోయే వారితో సమస్యలు పరిష్కారం కావని, స్థానికంగా ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే వ్యక్తిగా తాను ముందు ఉంటానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement