Sunday, April 28, 2024

TS: ఘాటెక్కిన ఉల్లి ధరలు..

నిజామాబాద్ : నిత్యవసరాల్లో ఒకటైన ఉల్లి ధరలు ఘాటెక్కాయి… నిత్యావసర వస్తువుల ధరలన్నీ మండిపోవడంతో సామాన్య ప్రజల జనజీవనం కొనసాగించడం కష్టంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా 20 రూపాయలు అమ్మే ఉల్లిపాయలు 50 నుండి 80 రూపాయలకు మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రతినిత్యం ప్రతి కూరలో ఉల్లిపాయలను వాడాల్సిందే. ఉల్లి వాడకం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడటంతో పాటు రుచిలో కూడా ఉల్లి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. వెల్లుల్లి ముందే ఘాటు.. ఇప్పుడు ప్రస్తుతం వెల్లుల్లి మరింత ఘాటెక్కిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది 60 నుండి 100 రూపాయలకు మార్కెట్లో దొరికే వెల్లుల్లి 200వరకు ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు అమ్ముతున్నారు.

కూలీనాలీ చేసుకుని చిన్నాచితక వ్యాపారాలతో జీవనాన్ని వెళ్ళదీసే ఎంతోమంది నిరుపేదలు నిత్యవసరాలను కొనలేక మరోపక్క వాటి వాడకాన్ని తప్పని పరిస్థితుల్లో వాడుకుంటూ పడరాని పాట్లు పడుతున్నారు. గత రెండేళ్ల క్రితం ఉల్లిపాయలు ఇదేవిధంగా 100 రూపాయలు పలికింది. దేశ ప్రజలంతా గగ్గోలు పెట్టారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రేషన్ షాపుల్లో 20 రూపాయలకు ఉల్లిపాయలను అందజేశారు. రైతులు పండించిన సమయంలో రైతుకు ఐదు రూపాయల నుండి పది రూపాయల వరకు చేరుతుంది.

బడా వ్యాపారులు ఉల్లిపాయల లాంటి వాటిని సైతం పెద్ద ఎత్తున కొనుగోలు చేసి స్టోరేజ్ పాయింట్లలో స్టాక్ చేసుకొని మార్కెట్లో కృత్రిమ కొరతను కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి సామాన్యులకు ఉల్లి వెల్లులను రేషన్ షాపుల ద్వారా అందించి నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పప్పు ధాన్యాల ధరలు సైతం మండుతున్నాయి. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటడంతో పేదలు కష్టాలు చూడక తప్పడం లేదు. నిత్యవసరాలు కొనుగోలు చేయక తప్పడం లేదు. మరోపక్క కొనుగోలు చేయడానికి డబ్బులు లేక ఎంతోమంది పేదలు సైతం అప్పలపాలవుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement