Sunday, April 28, 2024

Nalgonda – జడ్పీ చైర్మన్ కి మంత్రి కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలి – కేటీఆర్ డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు జరిగిన సమావేశంలో దుర్మార్గంగా వ్యవహరించిన తీరుపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అధికారం, అహంకారంతో కోమటిరెడ్డి వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. అహంకారంతో అడ్డగోలుగా జడ్పీ చైర్మన్ పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పైన నోరు పారేసుకుంటున్నారని అన్నారు. మొన్నటికి మొన్న రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టమని తన అహంకారాన్ని బయట పెట్టుకున్న మంత్రి , ఈరోజు జిల్లా జడ్పీ చైర్మన్ పై అదే నోటి దురుసు చూపించారన్నారు.

ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం లేకుండా నియంతృత్వ ధోరణిలో పని చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులపైన కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అడ్డుకొని తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. పార్టీ అంతా సందీప్ రెడ్డికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీలో ఉన్న కిందిస్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకి ఎవరికి ఇబ్బంది ఎదురైనా 60 లక్షల మంది కార్యకర్తల బలగం ఉన్న బిఆర్ఎస్ పార్టీ కుటుంబం భరోసాగా నిలబడుతుందని తెలిపారు.

కోమటిరెడ్డి అరాచకపు వ్యవహారంలో గట్టిగా నిలబడి, నిలదీసిన సందీప్ రెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గ పూరిత వ్యవహారాలకు దిగినా, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు అయ్యేదాకా ఇలాగే కొట్లాడుదామని సందీప్ రెడ్డితో కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement