భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఆత్మహత్య కారణాల అన్వేషణలో… అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల తల్లిదండ్రులు సరికొత్త ఆరోపణల నేపథ్యంలో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవర్తో అక్రమ సంబంధం ఉందని.. ఆ విషయం భవ్య, వైష్ణవికి తెలియటంతో వార్డెన్ వేధించారనే వాదన తెరపైకి వచ్చింది. అందుకే పిల్లలిద్దరినీ హత్య చేసే ముందు తప్పుడు సూసైడ్ లెటర్ రాయించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ‘‘మా మేడం శైలజ మంచిది.. ఆమెను ఒక్క మాట కూడా అనకండి” అని విద్యార్థినులు రాసినట్టు చెబుతున్న సూసైడ్ లెటర్తో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ స్థితిలో వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరినీ ప్రశ్నిస్తున్నారు.
ఆరుగురిపై కేసు నమోదు..
మరోవైపు భువనగిరి హాస్టల్లో బాలికల ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదైంది. హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటోడ్రైవర్ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచనపై కేసు నమోదు కాగా. అటు పీఈటీ ప్రతిభ, టీచర్ భువనేశ్వరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్, ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు..అటు వార్డెన్ శైలజ, ఆంజనేయులును విచారిస్తున్నారు పోలీసులు. దోషులను శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి..మరోవైపు విద్యార్థినుల ఆత్మహత్యతో హాస్టల్ ఖాళీ అయ్యింది.