Monday, June 17, 2024

TS: ఇక్క‌డి నుంచి ఢిల్లీకి ముడుపులు… బీజేపీ నేత ప్ర‌భాక‌ర్

రేవంత్ విమానాన్ని త‌నిఖీ చేయాల్సిందే
బీజేపీ నేత ప్ర‌భాక‌ర్ డిమాండ్
ప్ర‌తి ద‌శ ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్ ఢిల్లీకి ప‌య‌నం
ఇక్క‌డ దోచింది.. అక్క‌డ‌ ఇచ్చేందుకేనంటూ ఆరోప‌ణ‌
తెలంగాణ‌లో ఆస్తులు త‌రుగుతుంటే, మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయి
సివిల్ స‌ప్లై అవినీతిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల్సిందే..
సివిల్ సప్లై శాఖలో భారీగా అవినీతి జరుగుతోందని, తక్షణమే ఆ శాఖపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై రచ్చ జరుగుతుంటే సీఎం కనీసం స్పందించడం లేద‌ని మండిపడ్డారు. ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకే మంత్రులు తహతహలాడుతున్నారని విమర్శించారు.

హైద‌రాబాద్ లోని బీజేపీ కార్యాల‌యంలో ఇవాళ‌ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి సమీక్షలకు సంబంధిత మంత్రులు హాజరుకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారని తెలిపారు. మంత్రివర్గ కూర్పులో ముఖ్యమంత్రి నామ్ కే వాస్త్ గా ఉన్నారని తెలిపారు. డిల్లీకి కప్పం కట్టేందుకే మంత్రివర్గం ఉన్నట్లు ఉందన్నారు. ధనిక రాష్ట్ర ఆస్తులు తరుగుతున్నాయ‌ని, మంత్రుల ఆస్తులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు.

సివిల్ సప్లై శాఖను గతంలో బీఆర్ఎస్, ఈరోజు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ధ్వ‌జ‌మెత్తారు. ధాన్యం కొనుగోలులో జరిగే అవినీతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఒక్కో దశ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఢిల్లీ వెళ్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ వెళ్లే విమానాన్ని ఎన్నికల కమిషన్ తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాకు నీవు.. నీకు నేను అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయ‌ని కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

రైతుల విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు ప్ర‌భాక‌ర్. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మొక్కుబడిగా చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. అనేక మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదన్నారు. వరికి రూ.500 బోనస్‌పై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదన్నారు. గతంలో కేసీఆర్ రుణమాఫీ చేస్తానని పదేళ్ల పాటు నాన్చారని.. ఇప్పటికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రైతులకు రుణమాఫీ చేసేందుకు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని.. ఆ పేరుతో అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement