Friday, March 29, 2024

Police commemoration day: బెల్లంపల్లిలో మెగా రక్తదాన శిబిరం.. 2360 యూనిట్ల రక్తం సేకరణ

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మంగళవారం బెల్లంపల్లి గ్రౌండ్స్ లో జరిగిన ఈ మెగా రక్తదాన శిబిరాన్ని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. వేలాది మంది యువకులు తరలివచ్చి 2360 యూనిట్ల రక్తం దానం చేయడం విశేషం. కాగా, ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్​ కమిషనర్​ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమని, ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేస్తున్నదన్నారు. అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు.

ప్రతీ ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు సీపీ చంద్రశేఖర్​రెడ్డి. అమరుల త్యాగ ఫలంగానే ఈరోజు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారన్నారు. పేద ప్రజలు, బాధితులకు సత్వర న్యాయం అందించడం, ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే అమరుల త్యాగానికి నిజమైన నివాళి అని తెలిపారు. థలసేమియా, కేన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని, రక్త దానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని, రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దన్నారు.

ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి 6 నెలలకొకసారి రక్తదానం చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున రక్త దానం శిబిరం ఏర్పాటు చేసిన బెల్లంపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్, సబ్ డివిజన్ పోలీస్ అధికారులను అభినందించారు. అదేవిధంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన పోలీస్ సిబ్బంది, యువతకు ప్రజలందరికీ వలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ బాబు రావు, బెల్లంపల్లి టౌన్ సీఐ రాజు, మందమర్రి సీఐ ప్రమోద్ రావు, తాండూర్ సీఐ జగదీష్, సబ్ డివిజన్ ఎస్ఐ లు, రెడ్ క్రాస్ సోసైటీ సభ్యులు, సిబ్బంది, యువత, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement