Monday, April 29, 2024

నాడు కూలీలు.. నేడు యజమానులు.. ఇదే దళిత బంధు గొప్పతనం : ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్ చెరు : దేశంలోనే మొట్టమొదటి సారిగా దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం వారి జీవితాల్లో నూతన శకానికి నాంది పలుకుతోందని పటాన్చెరు ఎమ్మెల్యే జీఎంఆర్ అన్నారు. ఒకప్పుడు కూలీలుగా పని చేసిన వారే నేడు యజమానులుగా పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. పటాన్చెరు మండలం బచ్చు గూడెం గ్రామానికి చెందిన ఆరుగురు దళిత బంధు పథకం లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మూడు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి.. వంద మంది లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల విలువైన యూనిట్లు అందించడం జరిగిందని తెలిపారు. వివిధ శాఖల అధికారులతో వారు ఎంపిక చేసుకున్న యూనిట్లపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు మూడు నెలలకు ఒకసారి వాటి ప్రగతి పై సమీక్షలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. యూనిట్లు పొందిన లబ్ధిదారులందరూ విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. త్వరలోనే మరిన్ని యూనిట్లు మంజూరు కానున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుమతి రామచందర్, ఎంపీటీసీ బిక్షపతి, ఎంపీడీవో బన్సీలాల్, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement