Saturday, April 20, 2024

టీటీడీ విజిలెన్స్‌ వలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ..

పెద్దల సభ సభ్యుడు తిరుమలలో అక్రమాలకు తెర తీసారు. ఎమ్మెల్సీగా తిరుమలలో తనకు ఉన్న అవకాశాలను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించారు. టీటీడీ విజిలెన్స్ కు అడ్డంగా దొరికిపోయారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు ఎప్పుడూ పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే, శ్రీవారిని త్వరగా దర్శించుకొని వెళ్లిపోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. దానికోసం అడ్డదారులు తొక్కి అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు ఉంటాయి. ఇక, తమకు ఉన్న పలుకుబడితో ప్రజాప్రతినిధులు, నేతలు కూడా భక్తులకు దర్శనం చేయించిన సందర్భాలు లేకపోలేదు.. ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు టీటీడీ విజిలెన్స్‌ కట్టడి చేస్తూనే ఉంటుంది.. తాజాగా, విజిలెన్స్‌ వలలో చిక్కారు ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ.


ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ తరచు శ్రీవారి దర్శనానికి వస్తుండడంతో అనుమానించిన టీటీడీ ఉన్నతాధికారులు.. దీనిపై విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు.. అయితే, రంగంలోకి దిగిన విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించింది.. పోర్జరీ ఆధార్‌ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తున్నట్టు గుర్తించింది.. ఆరుగురి దర్శనం కోసం లక్షా 5 వేల రూపాయలను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఈ మొత్తాన్ని ఎమ్మెల్సీ డ్రైవర్‌ ఖాతాకు సదరు భక్తులు పంపారని విజిలెన్స్‌ అధికారులు చెబుతున్నారు.. ఇక, నెల రోజుల వ్యవధిలో 19 సిఫార్సు లేఖలు జారీ చేశారట ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ.. ప్రతి సిఫార్సు లేఖను ఎమ్మెల్సీ ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకే ఇచ్చినట్లు టీటీడీ విజిలెన్స్‌ గుర్తించింది. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. టీటీడీలో ద‌ళారుల ఏరివేత చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశామ‌ని, టికెట్ల అమ్మ‌కానికి పాల్ప‌డే వ్య‌క్తులు ఎంత‌టి వారైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈవో ధ‌ర్మారెడ్డి హెచ్చ‌రించారు. ఇందుకు ఎమ్మెల్సీపై కేసు న‌మోదే ఉదాహ‌ర‌ణగా ఆయ‌న చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement