Wednesday, May 1, 2024

Siddipet: మహిళల ఆరోగ్య భద్రతకే రుతుప్రేమ.. మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట ప్రతినిధి, జులై 19 : మహిళల ఆరోగ్య భద్రత కోసమే ఈ రుతుప్రేమ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట గ్రామీణ మండలం రాఘవాపూర్ ఎస్సీ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఉదయం నిర్వహించిన రుతుప్రేమ కార్యక్రమానికి హాజరై మంత్రి మాట్లాడారు. ఈ రుతుప్రేమ గురించి ఇంట్లో సైతం మాట్లాడలేని పరిస్థితి, కానీ ఇవాళ బహిర్గతంగా మాట్లాడి చర్చించడం స్వాగతించదగిన విషయమని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ రుతుప్రేమ కార్యక్రమంలో మహిళలందరినీ సమన్వయ పరిచి భాగస్వామ్యం అయ్యేలా గుర్తించాలని ఆశా, ఏఏన్ఎంలను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

ఇదో విభిన్నమైన కార్యక్రమం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో విద్యావంతులుగా ఉన్నోళ్లు ఈ రుతుప్రేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్ శాంతి దొరకడం అదృష్టం, ఓ వరంగా భావించాలని చెప్పారు. తోటి మహిళలకు సామాజికంగా తనవంతు సేవ చేయాలనే మంచి సంకల్పంతో సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత సైతం ఈ రుతుప్రేమ కార్యక్రమానికి హాజరై అవగాహన కల్పిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని, దీన్ని మీరంతా అందిపుచ్చుకోవాలని కోరారు. ప్రతీ 10 మందిలో నలుగురు క్యాన్సర్ తో మృతి చెందుతున్నారని, క్యాన్సర్ అతి ప్రమాదకరమైన వ్యాధిగా వివరిస్తూ.. ప్లాస్టిక్ కాలుష్య కారక, ఔషధ ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ వస్తున్నదని, ఈ దరిమిలా మీ ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ.. ప్రతీ గ్రామంలో ప్రజా ఆరోగ్య ప్రయోజనార్థం స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

నంగునూరు మండలంలో నిర్వహిస్తున్న రుతుప్రేమ కార్యక్రమానికి అనుకున్న లక్ష్యాన్ని చేరేలా మహిళలు హాజరవుతున్నారని, అదే తరహాలో సిద్ధిపేట గ్రామీణ మండలంలోని గ్రామ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఒంటరి, వితంతు మహిళలకు కుట్టు శిక్షణ తరగతులు జరిపి, అనంతరం వారు స్వయం ఉపాధి పొందేలా కుట్టు మిషన్లు ఇప్పించే కార్యక్రమాన్ని తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. నియోజకవర్గ పరిధిలో 3500 మంది మహిళలకు కుట్టు శిక్షణ, మిషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. చెత్తను వేర్వేరుగా చేస్తే పరిశుభ్రతను పాటించినట్లుగా ఇళ్లు శుభ్రంగా నిలిపినట్లే, గల్లీ, గ్రామాన్ని శుభ్రంగా నిలిపితే ఎలాంటి అనారోగ్యాలు రావని మహిళలకు మంత్రి అవగాహన కల్పించారు. అనంతరం రాఘవాపూర్ గ్రామ మహిళలకు డాక్టర్ శాంతి, సీపీ శ్వేత, డీపీఓ దేవకిలు రుతుప్రేమ పై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత, డీపీఓ దేవకి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement