Friday, May 17, 2024

స్వయంభు హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

తూప్రాన్ : సాక్షాత్తు స్వయంభు శ్రీవీరాంజనేయ స్వామి కొలువుదీరిన మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం తూప్రాన్‌ పట్టణంలోని పెద్దచెరువు కట్ట ఆంజన్న దేవాలయంలో ఈనెల 16న మంగళవారం హనుమాన్‌ మాలధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సలాక ఆత్రేయశర్మ తెలిపారు. తూప్రాన్‌ మున్సిపల్‌ పరిధిలో రెండవ కొండగట్టుగా పేరుగాంచిన పెద్దచెరువుకట్ట స్వయంభు దేవాలయం శ్రీ వీరాంజనేయస్వామి మందిరం వద్ద 41 రోజుల దీక్ష ప్రారంభం అవుతుందన్నారు. మాలధరించిన భక్తులు ఆంజనేయస్వామి హనుమాన్‌ మందిరం వద్ద మాల ధరించి స్వామివారి కృపకు పాత్రులై అష్ట ఐశ్యర్యలు సంపూర్ణ ఆరోగ్యంపొందాలని ఆలయ ప్రధాన పూజారి హనుమాన్‌ మాల గురుస్వామి సలాక ఆత్రేయశర్మ పేర్కొన్నారు. పెద్దచెరువు కట్ట అంజన్న దేవాలయ ఆస్థాన వ్యవస్థాపక ప్రధాన పూజారి కీర్తిశేషులు సలాక శ్రీనివాస్‌శర్మ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం హనుమాన్‌ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరం మార్చి 16 మంగళవారం ఉదయం హనుమాన్‌ మాలధరణను భక్తజనకోటి కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుందని సలాక ఆత్రేయశర్మ తెలిపారు. ఎంతో మహత్యంతో ఆలయం స్వయంభుగా విరాజిల్లుతూ ఇటు భక్తుల కోర్కెలు నేరవేర్చడమేగాక తూప్రాన్‌ పట్టణ అభివృద్ధి దిన దిన ప్రవర్తమానమైందన్నారు. ఆంజనేయస్వామి ఆలయానికి దారి ఏర్పాటులో భాగంగా పెద్దచెరువు కట్టపై డబుల్‌రోడ్డు విస్తరణ జరిగి కట్టపై ఇరువైపులా పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందన్నారు. ఆలయానికి ఓ వైపు పచ్చని పంటపొలాలు మరోవైపు చెరువునీరు, పక్షుల కేరింతలు, పిట్టల కిచకిచలు ఒకింత ఒళ్ళు పులకరించి మనసంతా ప్రశాంతత చేకూర్చే దృశ్యాలతో భక్తితో పరవశించిపోయి ఆనందానుభూతులు అనుభవిస్తే గాని తెలిసి వస్తుందని ఆత్రేయశర్మ ఉద్బోదించారు. అందుకే చెరువుకట్ట ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకొని అద్భుత ఫలితాలు సొంతం చేసుకునే భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కంకణం కట్టుకొని విశేష కృషి చేస్తున్న తనకు అందరూ సహకరించాలని ఆలయ పూజారి, హనుమాన్‌ మాల గురుస్వామి ఆత్రేయశర్మ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement