Sunday, May 5, 2024

Mahalaxmi Scheme …రేపటి నుంచి మహిళలకు సిటీ, పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణం ఉచితం…

హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇదొకటి. అయితే, సిటీ బస్సులతో పాటు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ”మహాలక్ష్మి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకం ప్రారంభిస్తాం. మహిళా మంత్రులు, సీఎస్‌, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజా రవాణా వ్యవస్థలో చరిత్రాత్మక నిర్ణయం ఇది. ఈ పథకం ద్వారా ప్రజా రవాణాకు మేలు జరుగుతుంది. మహిళా సాధికారతకు దోహద పడుతుంది. కొవిడ్‌ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగింది. దీని వల్ల ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడింది. పెరుగుతున్న వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు, కాలష్యం పెరుగుతోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల మహిళలకు రక్షణ ఉంటుంది. ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది.

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదో ఒక స్థానికత ధ్రువీకరణ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ ఇస్తాం. 5.. 6 రోజుల తర్వాత ఎలక్ట్రానిక్‌ మిషన్‌ ద్వారా జీరో టికెట్‌ ప్రింటింగ్‌ చేస్తాం. కొన్ని రోజులు గడిచిన తర్వాత దీనిపై సమీక్షించి.. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతాం. ప్రస్తుతం 7,200 సర్వీసులను మహాలక్ష్మి పథకం కోసం ఉపయోగిస్తాం” అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement