Tuesday, May 7, 2024

Kite Deaths – సంక్రాంతి పండుగ‌లో విషాదం… గాలిప‌టాలు ఎగుర‌వేస్తూ ఏడుగురు దుర్మ‌ర‌ణం

హైద‌రాబాద్ – ఈ ఏడాది సంక్రాంతి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ వ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు యువకులు విద్యుదాఘాతంతో, పైకప్పుపై నుండి పడి ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు మంజా తగిలి మరణించాడు..

వీటిలో ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందగా, ఒకరు సంగారెడ్డి లో చనిపోయారు.. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ టెర్రస్ నుండి పడి 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాజశేఖర్ కుమారుడు ఆకాష్‌గా గుర్తించారు.. గాలిపటాలు ఎగురవేస్తూ ప్రమాదవసాత్తు కిందపడి మరణించారు..

ఇక జోగిపేట పట్టణంలోని రెండంతస్తుల ఇంటి టెర్రస్‌పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి సుబ్రహ్మణ్యం గా పోలీసులు గుర్తించారు. గాలిపటం ఎగురవేస్తుండగా హైటెన్షన్ వైరు తగిలి భవనంపై నుంచి పడిపోయాడు.. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలను విడిచాడు.. అలాగే అత్తాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనం టెర్రస్‌పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో తనిష్క్ (11) మృతి చెందాడు. ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి ఓ అపార్ట్‌మెంట్ భవనం పైకప్పుపై గాలిపటాలు ఎగురవేస్తున్నాడు.. విద్యుత్ వైర్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.. అలాగే నాగోల్ లో ఓ చిన్నారి గాలి పటాలు ఎగురవేస్తూ చనిపోయాడు..
చైనా మాంజా హైదరాబాద్‌లో ఓ సైనికుడి ప్రాణాలను బలిగొంది.. అతని గొంతుకు వైర్ తగిలి కోసుకుపోయింది.. ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చనిపోయాడు..

క‌నుమ రోజునే ఇద్ద‌రు మృతి..

క‌నుమ రోజైన నేడు ప‌తంగ్ లు ఎగుర‌వేస్తూ ఇద్దరు మృతి చెందారు.. రహ్మత్ నగర్‌లో స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి వెళ్లిన కపిల్ దేవ్ (23) అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి ప్రమాదశాత్తూ కింద పడడంతో మృతి చెందాడు. యాప్రాల్‌లో పతంగి ఎగరవేస్తూ భువన్ సాయి అనే బాలుడు భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement