Thursday, May 9, 2024

రైతు కేంద్రంగా వ్య‌వ‌సాయం – కెసిఆర్ వ్యూహం..

ఈ దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి. సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లాలి. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలి. రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండానే వాటి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను కేంద్రం ఏకపక్షంగా తీసుకుని రుద్దడం వల్ల ఆయా రాష్ట్రాల్లో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలుగుతున్నది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలలో కేంద్రానికి మితిమీరిన ఆజమాయిషీ ఎందుకుండాలి? ఆయా రాష్ట్రాల భౌగోళిక భిన్నత్వం, సాంస్కృతిక ప్రత్యేకతలు, స్థానిక అవసరాలు, సామాజిక కూర్పు ఆధారంగా రాష్ట్రాలు తీసుకోవాల్సిన నిర్ణయాలను, రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే తీసుకుంటోంది. దీంతో రాష్ట్రాల నిర్దిష్ట అవసరాలకు, ప్రయోజనాలకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు మధ్య పొంతన లేకుండా పోతోంది. దీంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. దేశ విశాల ప్రయోజనాల కోసం కాకుండా కేంద్ర ప్రభుత్వాలు తమ చిల్లర మల్లర ప్రయోజనాలకోసం తీసుకునే నిర్ణయాలు ఆయా రాష్ట్రాల అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి అందుకే ఈ దేశ రాజకీయ ప్రక్రియలో ఒక గుణాత్మక మార్పు అనివార్యం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశమంతటా రైతును రాజును చేసి, వీలైనంతమేర నీటి వనరుల సద్వినియోగంతో దేశాన్ని సస్యశ్యామలం చేసేలా బీఆర్‌ఎస్‌ అధినేత వ్యూహరచన చేస్తున్నారు. రైతులను సంఘటితం చేసి తెలంగాణ తరహా రైతు సంక్షేమ పథకాలను దేశమంతటా అమలు చేయడమే కాదు మరిన్ని సరికొత్త పథకాలతో విప్లవం సృష్టించాలని కసరత్తు చేస్తున్నారు. రైతు కేంద్రంగా వ్యవసాయం పండుగ చేసేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ దిశలో గతంలో కేంద్రం తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిన పాత చట్టాల మంచి, చెడులను అధ్యయనం చేయిస్తున్నారని తెలిసింది.

దేశంలోని రైతులను మూకుమ్మడిగా ముంచే చట్టాల ముసాయిదాతో బీజేపీ కేంద్ర సర్కార్‌ ఆగ్రహాన్ని చవిచూడగా, దేశప్రజలు, రైతుల మన్ననలను పొందే చట్టాల దిశగా బీఆర్‌ఎస్‌ కార్యాచరణ చేస్తోంది. దేశంలోని భూములను సాగులోకి తేవడం, రైతులను లక్షాధికారులను చేసి స్వయం స్వావలంబన, పథకాలతో వారికి ఊతంగా నిల్చి పెట్టుబడి అందజేత, రుణాల వెసులుబాటు, ఎరువులు, విద్యుత్‌, నీటి వనరుల అందజేత వంటి లక్ష్యాలతో బీఆర్‌ఎస్‌ దేశంలో నయా వ్యవసాయ విధానాలకు అంకురార్పణ దిశగా శ్రమిస్తోంది. ఈ పథకాలతో దేశంలో సరికొత్త చర్చకు దారితీసేలా సీఎం కేసీఆర్‌ పలు ఆలోచనలు చేస్తున్నారని, త్వరలోనే భారీఎత్తున పలు రంగాలకు చెందిన నిపుణులతో సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, పంపిణీ బాధ్యతలను సమన్వయం చేయడం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అమలు చేయడం, కార్పొరేట్‌ పారిశ్రామిక వేత్తలకు కేంద్రం రూ.6 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేయడంపై ఉన్న బీజేపీ సర్కార్‌ శ్రద్ధ రైతులపై ఎందుకులేదని నిలదీసేలా కార్యాచరణ చేస్తున్నారు. దేశంలో బీజేపీ ముక్త్‌ భారత్‌ నినాదంతోపాటు తెలంగాణ రైతులకు ఇచ్చినట్లుగానే దేశంలోని రైతాంగానికి ఉచిత కరెంట్‌ 24గంటలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ఇదివరకే హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలతో సమా వేశమై పలు అంశాలపై చర్చించారు. వ్యవసాయ రంగం, రైతు ల సమస్యలు, వాటి పరిష్కారం, సాగునీటి రంగాల అభివృద్ధి పై పలువురి అభిప్రాయాలను సేకరించారు. జాతీయ స్థాయిలో రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం విస్మరించింది. దేశవ్యాప్తంగా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, ఎరువులు, సాగునీటి అందజేత, రైతుబంధు, రైతు మాఫీ, భూ యాజమాన్య హక్కుల కల్పన వంటివాటితోపాటు అనేక ఇతరత్రా అంశాలను పరిశీలిస్తున్నారు. దేశంలో అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలను త్వరలో అధ్యయనం చేయనున్నారు. ఇందుకు నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పలు రైతు సంఘాల నేతలతో త్వరలో మేదోమధనం చేయాలని భావిస్తున్నారు.

కేంద్రమిలా…
గతంలో కేంద్రం తీసుకురావాలని భావించిన నూతన వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టంపై సర్వత్రా విమర్శలు వెల్లువె త్తాయి. రాష్ట్రాల అభిప్రాయాలను కనీసంగా పరిగణనలోకి తీసుకోకపోవడంతో అనేక రాష్ట్రాలు ఆందోళన వెలిబుచ్చా యి. కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు, రాయితీలతో రైతుకు పెద్దఎత్తున చేయూతనిస్తున్న తెలంగా ణాతోపాటు అనేక ఇతర బీజేపీయేతర రాష్ట్రాలకు తీవ్ర విఘా తంగా మారిందని ఆరోపణలు వచ్చాయి. ఈ బిల్లుకు సంబం ధించిన అంశాలను పరిశీలిస్తే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు నిర్వీర్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఒప్పంద సేద్యం ద్వారా కొన్ని సందర్భాల్లో రైతుకు మద్దతు ధరలు అందకపో వచ్చు. సాగు చేసే సమయంలో కుదిరిన ఒప్పందం మేరకు ధరను నిర్దేశించుకుంటే తీరా పంట చేతికొచ్చి అమ్మే సమయా నికి ధరలు తగ్గితే కార్పొరేట్లు, వ్యక్తులు, సంస్థలు కొనుగోలు చేయడానికి నిరాకరించే ప్రమాదం ఉంది. అలాగే ధరలు పెరిగి తే నష్టపోవడం తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తీవ్రంగా పరిశీలిస్తు న్నారు. వీటికి విరుగుడుగా కొత్త చట్టాలు దేశంలోని రైతులకు ప్రయోజనకారిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ దిశలోనే పలు మార్గాలను, ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

దేశానికి దిక్సూచిగా, మార్పు కోసం… ఒక జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందడుగు వేశారు. కేసీఆర్‌ ప్రతిపాదించింది కేవలం శుష్కమైన రాజకీయ కూటమిని కాదు. ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ దిశలో దేశవ్యాప్త ఉద్యమాన్ని కేసీఆర్‌ నిర్మిస్తున్నారని ఆశిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇందుకు కలిసివచ్చే శక్తులన్నిటినీ కలుపుకొని ప్రజాస్వామ్యయుతంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనుభవంతో, ఆ అనుభవం పునాదిగా దేశంలో గుణాత్మక మార్పును సాధించడానికే సీఎం కేసీఆర్‌ నడుంకట్టారు. ఈ లక్ష్యసాధనలో భాగంగానే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement