Monday, April 29, 2024

TS: గెలిపించండి… అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా… ఈటెల రాజేందర్

కర్మన్ ఘాట్, ఏప్రిల్ 11 (ప్రభ న్యూస్) ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని 10సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశారని మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హస్తినాపురం డివిజన్ టీఎన్ఆర్ సులక్షణ గేటెడ్ కమ్యూనిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామరంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

కంప్యూటర్ యుగంలో ఐదు దశాబ్దాలుగా పాలించిన ఎంతో మంది ప్రధానులు చేయలేని అభివృద్ధి దశాబ్ద కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారని తెలిపారు. కేసీఆర్ పాలనలో చేసిన దొంగ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతం అవుతున్నాయని దీనిని ప్రజలు గమనించాలని కోరారు. అన్ని రకాల విషయ పరిజ్ఞానంలో మేధా సంపత్తులు మల్కాజ్గిరి ప్రజలే ముందున్నారని ఆయన అన్నారు. మినీ ఇండియా అని పిలుచుకునే మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు విజ్ఞులని ఆలోచించి తమ ఓటు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు నరేష్ యాదవ్, అమరేందర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, రాజేందర్ ప్రసాద్, మాధవరెడ్డి, రాజేందర్, మహేందర్ రెడ్డి, రాజ వర్ధన్, మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement